Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదర్శం

ABN , First Publish Date - 2022-12-30T14:15:27+05:30 IST

తల్లి హీరాబెన్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు ముగిసిన నిమిషాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధుల్లో మునిగిపోయారు.

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదర్శం
Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ: తనకు అత్యంత ప్రియమైన తల్లి హీరాబెన్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు ముగిసిన నిమిషాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధుల్లో మునిగిపోయారు. తల్లి మరణంతో పశ్చిమబెంగాల్ టూర్ రద్దు చేసుకున్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి ఆదర్శం చాటారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమబెంగాల్‌కు చెందిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. హౌరా- న్యూ జల్‌పాయి గురి మధ్య నడిచే ఈ సూపర్ ఫాస్ట్‌ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించడంతో పాటు పాటు 5,800 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని తాను నేరుగా రాలేకపోయినందుకు క్షమించాలని ప్రజలను కోరారు. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయానని చెప్పారు.

మరోవైపు కోల్‌కతాలో జరిగిన జాతీయ గంగా మండలి సమావేశానికి దృశ్యమాధ్యమం ద్వారా మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు తోమర్, హర్దీప్ సింగ్ పూరి, జితేందర్ సింగ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం ధామీ, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు.

ఈ తెల్లవారుజామున తన తల్లి హీరాబెన్ మోదీ కన్నుమూశారంటూ మోదీ ట్వీట్ చేశారు. వందో ఏట తన తల్లి శివుడి చెంతకు చేరారంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ఆ వెంటనే గాంధీనగర్ వెళ్లి తన సోదరులతో కలిసి తల్లి పాడెను మోశారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియలు ముగియగానే ప్రధాని తన విధుల్లో మునిగిపోవడం ద్వారా ఆదర్శంగా నిలిచారు.

హీరాబెన్ మోదీ ఇటీవలే తన వందో పుట్టినరోజు జరుపుకున్నారు. రెండ్రోజుల క్రితం శ్వాసపరమైన ఇబ్బందులతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Updated Date - 2022-12-30T15:14:00+05:30 IST