Modi vs Priyanka : హిమాచల్లో హోరాహోరీ
ABN , First Publish Date - 2022-11-03T05:00:56+05:30 IST
హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ..
మోదీ వర్సెస్ ప్రియాంక.. ఇరు పార్టీలకు రెబెల్స్ బెడద
న్యూఢిల్లీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ వాధ్రాలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండటంతో ప్రచార బాధ్యతలు అన్నీ ప్రియాంకపైనే పడ్డాయి. అక్టోబర్ 15న సోలన్లో ప్రియాంక ప్రారంభించిన విజయ్ సంకల్ప్ ర్యాలీకి భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఆ తర్వాత బీజేపీ కంచుకోట మండీ, హామీర్పూర్లలో ప్రియాంక ర్యాలీలు సాగాయి. చాలా చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోందని, ప్రియాంకా ర్యాలీలు, రోడ్ షోలకు పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రఽధాని మోదీ ఉనా, చంబా, బిలా్సపూర్, కులూలలో జరిగిన నాలుగు ర్యాలీల్లో పాల్గొన్నారు. నవంబర్ 5 నుంచి మరో నాలుగు ర్యాలీలను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వందల కోట్ల విలుపైన జల విద్యుత్, జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి మంత్రం వల్లెవేస్తున్నారు.
అయితే రెండు పార్టీలకు అసమ్మతి నేతల నుంచి సెగ గట్టిగానే తగులుతోంది. అనేకమంది తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ కొందరు ఇంకా రంగంలో ఉన్నారు. బీజేపీ 11 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించింది. దాదాపు 23 మంది తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్వయంగా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. బీజేపీతో పోలిస్తే కాంగ్రె్సకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద కాస్త తక్కువగానే ఉన్నది. కాంగ్రె్సకు చెందిన దాదాపు 20 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ తరఫున రాజీవ్ శుక్లా సిమ్లాకు వెళ్లారు.