Tatas And Airbus: గుజరాత్‌కు రూ.22 వేల కోట్ల మెగా ప్రాజెక్ట్

ABN , First Publish Date - 2022-10-27T21:56:10+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) సొంత రాష్ట్రం గుజరాత్‌‌ను (Gujarat) భారీ ప్రాజెక్ట్ వరించింది. టాటా (Tata), ఎయిర్‌బస్ (Airbus)లు వడోదరలో (Vododara) మిలిటరీ విమానాలను తయారు చేయనున్నారు.

Tatas And Airbus: గుజరాత్‌కు రూ.22 వేల కోట్ల మెగా ప్రాజెక్ట్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) సొంత రాష్ట్రం గుజరాత్‌‌ను (Gujarat) భారీ ప్రాజెక్ట్ వరించింది. టాటా (Tata), ఎయిర్‌బస్ (Airbus)లు ఉమ్మడిగా వడోదర నగరంలో (Vododara) మిలిటరీ విమానాలను తయారు చేయనున్నాయి. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,000 కోట్లు లేదా 2.66 బిలియన్ డాలర్లుగా ఉందని డిఫెన్స్ సెక్రటరీ డా. అజయ్ కుమార్ వెల్లడించారు. ఒక ప్రైవేటు కంపెనీ భారత్‌లో మిలిటరీ విమానాలు తయారుచేయడం ఇదే మొదటిసారని, ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.21,935 కోట్లని ఆయన చెప్పారు. సివిల్ విమానాల తయారీ కోసం దీనిని ఉపయోగించొచ్చునని వివరించారు. కాగా గుజరాత్‌ తదుపరి ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ఒప్పందం ఖరారవ్వడం విశేషం.

వచ్చే ఆదివారం వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాల సృష్టి జరగనుందనే అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే మిలిటరీ విమానాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కీలకమైన మిలిటరీ టెక్నాలజీ, పరికరాల విషయంలో విదేశాల సాయం కోరాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ఈ ప్రాజెక్ట్ ఊతమివ్వనుందనే అంచనాలున్నాయి. కాగా ఎయిర్‌బస్ నుంచి 56 విమానాల కొనుగోలుకు గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా 16 విమానాలు తయారై సిద్ధంగా ఉన్నవి అందించాల్సి ఉండగా.. 40 విమానాలను భారత్‌లోనే తయారు చేయాల్సి ఉంటుందని డిఫెన్స్ సెక్రటరీ గురువారం వెల్లడించింది.

Updated Date - 2022-10-27T21:58:11+05:30 IST