Gujarat: ప్రమాణ స్వీకారానికి ముందే కాషాయదళంలోకి ఆప్ ఎమ్మెల్యేల జంప్!

ABN , First Publish Date - 2022-12-11T15:22:19+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సన్నద్ధమౌతున్నారు.

Gujarat: ప్రమాణ స్వీకారానికి ముందే కాషాయదళంలోకి ఆప్ ఎమ్మెల్యేల జంప్!
Arvind Kejriwal

గాంధీనగర్: గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఐదుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరేందుకు సన్నద్ధమౌతున్నారు. బీజేపీ అధినాయకత్వంతో వీరంతా టచ్‌లో ఉన్నారని సమాచారం. ఐదుగురిలో ముగ్గురు మొన్నటిదాకా బీజేపీ ఎమ్మెల్యేలే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో వీరు ఆప్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఫలితాల్లో బీజేపీ సునామీ సృష్టించడంతో వీరు కూడా కమలదళంలో కలిసేందుకు సిద్ధమౌతున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా బీజేపీలో చేరేందుకు ఇప్పటికే బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆప్ 12.92 శాతం ఓట్లు సాధించింది. ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీజేపీ 156 స్థానాల్లతో గెలిచింది. కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందింది.

ఇంకా ప్రమాణ స్వీకారాలు కూడా కాకుండానే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారనే కథనాలు గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. వాస్తవానికి గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం.. ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే.. ఆ పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి; లేదా నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ/అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం అంతకన్నా ఎక్కువ సీట్లు సాధించి ఉండాలి; గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం స్థానాల్లో 2 శాతం సీట్లలో కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలుపొంది ఉండాలి. వీటిలో మొదటి రెండు నిబంధనల ద్వారా ఆప్‌ జాతీయ పార్టీ అయ్యింది. ఢిల్లీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆప్‌.. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. గోవాలో రెండు సీట్లలో నెగ్గి, 6.77 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు గుజరాత్‌లో 5 స్థానాల్లో గెలుపొందింది. అంటే నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటి జాతీయ పార్టీ స్థాయికి ఎదిగింది. కాగా, బీజేపీ, కాంగ్రెస్‌, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, టీఎంసీ.. ఇప్పటివరకు దేశంలో జాతీయ హోదా ఉన్న పార్టీలివి. తాజాగా ఆప్‌ వీటి సరసన 8వ పార్టీగా చేరింది.

ఉత్తరాదిలో బీజేపీని ఎదుర్కొనాలంటే హిందూత్వంపై ఏ పార్టీ అయినా వైఖరి చెప్పాల్సిందే. ఇదే అంశంపై గుజరాత్‌ ఎన్నికల ముంగిట ఇరుకునపెట్టాలని చూసినా ఆప్‌ తెలివిగా తిప్పికొట్టింది. సాక్షాత్తు కేజ్రీవాలే.. ‘‘కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మ’’లను ముద్రించాలన్న డిమాండ్‌తో బీజేపీకి షాకిచ్చారు. ఇదే ఆప్‌.. దేశ సమగ్రత, భద్రతకు సంబంధించిన ప్రధాన అంశమైన ఆర్టికిల్‌ 370 రద్దుతో పాటు అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి వాటిపై మాత్రం మెజార్జీ ప్రజల మనోభావాలకు తగినట్లుగా వ్యవహరించింది. అయోధ్యలో ఆలయం పూర్తయితే ఉచిత సందర్శనకు ఏర్పాట్లు చేస్తామని కేజ్రీ ప్రకటించడం ఈ కోవలోకేదే. అయితే, తటస్థ వైఖరిని వీడకుండానే, అవసరమైన సందర్భంలో హిందూత్వపై గళమెత్తుతూ ఆప్‌ ముందుకెళ్తోంది.

వచ్చే ఏడాది రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గుజరాత్‌లో కొత్తగా గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతుండటం ఆ పార్టీ వర్గాల్లో కలవరం పుట్టిస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరకుండా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వారిని ఏమేరకు కట్టడి చేస్తారో చూడాలి.

Updated Date - 2022-12-11T15:58:49+05:30 IST