Delhi MCD Exit Polls: ఎంసీడీ ఆప్‌దేనంటున్న పోల్ సర్వేలు

ABN , First Publish Date - 2022-12-05T18:24:21+05:30 IST

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 250 వార్డులకు గాను ఆప్ ...

Delhi MCD Exit Polls: ఎంసీడీ ఆప్‌దేనంటున్న పోల్ సర్వేలు
Delhi MCD Exit Polls

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. భారతీయ జనతా పార్టీకి 69 నుంచి 91 సీట్లు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ దారుణంగా చతికిలపడింది. 3 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇతరులు 5 నుంచి 9 వార్డుల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఇవి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు ఈ నెల 7న విడుదల అవుతాయి.

ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 250 వార్డులున్న ఎంసీడీలో మొత్తం 1349 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 709 మంది మహిళలున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈసీ అధికారులు 13,638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 1.45 కోట్ల మంది. ఈస్ట్, సౌత్, నార్త్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌గా (ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) మార్చాక జరిగిన తొలి ఎన్నికలివి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 40 వేల మంది పోలీసులు, 20 వేల మంది హోం గార్డులు, 108 కంపెనీల పారామిలిటరీ, రాష్ట్రాల పోలీస్ బలగాలు రక్షణ బాధ్యతల్లో నిర్వహించారు.

15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏలుతున్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని యోచిస్తోంది. అనేక మురికివాడలను రెగ్యులరైజ్ చేయడం బీజేపీకి ప్లస్ పాయింట్ కానుంది. ఎక్కడ గుడిసె ఉంటే అక్కడే పక్కా ఇల్లు కట్టుకోవచ్చనే ఫార్ములాను బీజేపీ ప్రచారం చేసింది. 126 సీట్లు సాధిస్తే మ్యాజిక్ నెంబర్ సాధించినట్లే. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను కూడా బరిలోకి దించి ప్రచారం చేసింది. 2017లో 36 శాతం ఓటింగ్ సాధించిన బీజేపీ మరోసారి విజయబావుటా ఎగురవేస్తామని భరోసా వ్యక్తం చేసింది.

బీజేపీకి చెక్ పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా యత్నించింది. బీజేపీ హయాంలో వ్యాపారులు ట్రేడ్ లైసన్స్ ఫీజ్ విషయంలో అసౌకర్యంగా ఉన్నారని ఆప్ ఆరోపించింది. అనేక వాణిజ్య సముదాయాలను కూడా బీజేపీ స్థంభింప చేయడాన్ని ఆప్ హైలైట్ చేసింది. అధికారంలోకి వస్తే కొద్ది కాలంలోనే అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని పారిస్, న్యూయార్క్‌ల మాదిరిగా మారుస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 2017 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 26 శాతం ఓటింగ్ సాధించింది. గత ఎంసీడీ ఎన్నికల్లో 21 శాతం ఓటింగ్ సాధించిన కాంగ్రెస్ ఈ సారి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Updated Date - 2022-12-05T20:13:30+05:30 IST