BZA to VSKP Train: మూడున్నర గంటల్లో విజయవాడ నుంచి విశాఖకు.. ఈ రైలు ఎప్పటి నుంచంటే..

ABN , First Publish Date - 2022-11-28T17:20:18+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలో ఉమ్మడి ‘పశ్చిమ’ జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా పరుగులు పెట్టనుంది. వాల్తేరు డివిజన్‌కు ఈ రైలును..

BZA to VSKP Train: మూడున్నర గంటల్లో విజయవాడ నుంచి విశాఖకు.. ఈ రైలు ఎప్పటి నుంచంటే..

నరసాపురం: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express Train) త్వరలో ఉమ్మడి ‘పశ్చిమ’ జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా పరుగులు పెట్టనుంది. వాల్తేరు డివిజన్‌కు ఈ రైలును కేటాయించనున్నారు. దీన్ని విశాఖ - విజయవాడ (VSKP to BZA Vande Bharat Train) మధ్య నడిపేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరు రెండో వారం నుంచి నడిపే అవకాశం ఉంది. ఇప్పటికే రైలు పట్టాల సామర్థ్య పరీక్షను గత రెండు రోజులుగా నిపుణుల బృందం పరిశీలి స్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ఉమ్మడి జిల్లాల్లోని తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

అత్యధునిక సౌకర్యాలు..

ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తున్నాయి. అదే వందేభారత్‌ అయితే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనుంది. దీనివల్ల ప్రయాణ వ్యవధి మరింతగా తగ్గుతుంది. విజయవాడ నుంచి విశాఖపట్నంకు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. ప్రధాన స్టేషన్లలోనే ఆగుతుంది. పూర్తిగా ఏసీ సదుపాయం కలిగి ఉంటుంది. ప్రయాణికులు బయటకొచ్చేందుకు నాలుగు అత్యవసర ద్వారాలు ఉంటాయి. ప్రతి కోచ్‌ బయట, లోపలా సీసీ కెమెరాలు ఉంటాయి. ఎమర్జెనీ లైటింగ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు ఉంటాయి. చిన్నపాటి పొగ వస్తే వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేసే అలారం వ్యవస్థ కలిగి ఉంటుంది. కేవలం ఎనిమిది బోగీలతో నడిచే ఈ రైలు చైర్‌కార్‌ కాగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. క్లాస్‌ను బట్టి టికెట్‌ ధరలు నిర్ణయిస్తారు.

Updated Date - 2022-11-28T17:22:27+05:30 IST