BJP Leader: వైసీపీ, బీజేపీ మధ్య బంధాన్ని చెప్పిన జీవీఎల్

ABN , First Publish Date - 2022-12-02T12:36:33+05:30 IST

వైసీపీ, బీజేపీకి మధ్య ఉన్నది రాజ్యాంగ బద్ధమైన సంబంధాలే అంతకుమించి ఏమీ లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.

BJP Leader: వైసీపీ, బీజేపీ మధ్య బంధాన్ని చెప్పిన జీవీఎల్

విశాఖపట్నం: వైసీపీ, బీజేపీకి మధ్య ఉన్నది రాజ్యాంగ బద్ధమైన సంబంధాలే అంతకుమించి ఏమీ లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL NarasimhaRao) స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రధాన ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేనలే నిలబడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేనికి సహకరించడం లేదని... కనీసం రాష్ట్ర వాటా నిధులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పోలవరం మాదంటే మాది అని రెండు ప్రధాన పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయన్నారు. పోలవరం ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా కుంటుపడ్డాయన్నారు. పోలవరంపై తాము బాహుబలిగా వైసీపీ అభివర్ణించుకుంటోందని యెద్దేవా చేశారు. మిగిలిన పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పిల్లిగా మారిపోతోందన్నారు. నీటివనరులపై సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే దమ్ము వైసీపీకి ఉందా అని బీజేపీ ఎంపీ సవాల్ విసిరారు.

విశాఖలో భూములను పెద్ద సంఖ్యలో కొట్టేస్తున్నారన్నారు. భూదొంగల ఎలయన్స్ ఇది అని... సిట్ రెండు నివేదికలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణాలపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో చర్చించబోతున్నామని తెలిపారు. రాజకీయరాబంధులే భూదొంగలుగా మారారని మండిపడ్డారు. విశాఖకు వచ్చే ఏప్రిల్ నాటికి 5జీ సేవలు వస్తాయన్నారు. వందేభారత్ రైలు మూడింటిని విశాఖ నుంచి నడపబోతున్నామని చెప్పారు. విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఎస్టీపీఐని బలోపేతం చేయాలని.. ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసుకోవాలని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-02T12:36:34+05:30 IST