Chandrababu: మీరు మనుషులేనా.. మీకు మానవత్వం ఉందా?: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-12-31T19:57:09+05:30 IST

వైసీపీ నాయకులు మనుషులేనా? వీళ్లకి మానవత్వం ఉందా? ప్రజలు చనిపోతే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. గేలి చేస్తున్నారు. నీతిమాలిన విమర్శలు చేస్తున్నారు.

Chandrababu: మీరు మనుషులేనా.. మీకు మానవత్వం ఉందా?: చంద్రబాబు

కొండపి: ‘‘వైసీపీ నాయకులు మనుషులేనా? వీళ్లకి మానవత్వం ఉందా? ప్రజలు చనిపోతే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. గేలి చేస్తున్నారు. నీతిమాలిన విమర్శలు చేస్తున్నారు. వీళ్ల బారి నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడతా’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా (Nellore District) కందుకూరు ఘటనలో మృతిచెందిన ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరుకు చెందిన ఈదుమూడి రాజేశ్వరి కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా రాజేశ్వరి భర్త ఈదుమూడి కృష్ణకు రూ.7.50లక్షలు, రాజేశ్వరి తల్లిదండ్రులకు రూ.7.50లక్షల చెక్కులను అందజేశారు.

అనంతరం అక్కడి కూడలిలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. కందుకూరు ఘటన దురదృష్టకరమన్నారు. పార్టీ 8మంది కుటుంబ సభ్యులను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజకీయ నేతలు పర్యటనలకు వెళ్లినప్పుడు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయాలి. పరదాలు కట్టుకుని వెళ్లే సీఎం దగ్గరకు మాత్రమే వారు వెళ్తున్నారు. నందిగామ (Nandigama)లో నా సభలో రాయి విసిరితే పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. కర్నూలులో వైసీపీ (YCP) మూకలు వస్తే పట్టించుకోలేదు. ఇది మంచి విధానం కాదు. నా రాజకీయ జీవితంలో చూడనంత మంది జనం ఇప్పుడు నా సభలకు వస్తున్నారు. కందుకూరు ఘటన సమయంలో నేను అప్రమత్తం చేశాను. కానీ పోలీసులు ఎక్కడా కనిపించ లేదు. వెంటనే బాధితులను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లా. మీటింగ్‌ రద్దు చేసుకున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2022-12-31T19:57:11+05:30 IST