Share News

Revanth Reddy: శభాష్.. నీ ధైర్యం స్ఫూర్తినింపింది.. బాలుడిపై ప్రశంసలు కురిపించిన రేవంత్

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:02 PM

హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి 16 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు.

Revanth Reddy: శభాష్.. నీ ధైర్యం స్ఫూర్తినింపింది.. బాలుడిపై ప్రశంసలు కురిపించిన రేవంత్

హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి 16 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు.

బాలుడి సాహసాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మెచ్చుకున్నారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం కొనియాడారు.


ఘటన జరిగిందిలా..

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని స్థానిక అలెన్‌ హోమియో, హెర్బల్‌ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలో కొద్దిరోజులుగా మరమ్మతులు జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం వెల్డింగ్‌ పని చేస్తుండగా నిప్పురవ్వులు ఎగిశాయి. హోమియో ఔషధాల తయారీకి వినియోగించే ఆల్కహాల్‌, ఇతర రసాయనాలు అప్పటికే అక్కడ పడి ఉండడంతో.. ఆ నిప్పురవ్వలు పడగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు శరవేగంగా వ్యాపించి అక్కడే ఉన్న 15 ఆల్కహాల్‌ బ్యారెళ్లకు అంటుకోవడంతో మంటల తీవ్రత పెరిగింది.


ఆ సమయంలో పరిశ్రమలో పనిచేస్తున్న 50 మందిలో అత్యధికులు వెనకభాగంలో ఉన్న మెట్లపైనుంచి సురక్షితంగా కిందికి చేరుకున్నారు. నాలుగో అంతస్తులో ఉన్న ఆరుగురు వ్యక్తులు కిందికి రావడానికి ఇబ్బంది పడ్డారు. వారిలో కేఎల్‌ఎన్‌ చారి అనే ఉద్యోగి.. ప్రాణాలు కాపాడుకోవడానికి అంత ఎత్తు నుంచి కిందికి దూకేయడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా ఐదుగురినీ సాయిచరణ్‌ అనే బాలుడు కాపాడాడు.

తన స్నేహితుడి తల్లి అదే కంపెనీలో పనిచేస్తుండడంతో.. అగ్నిప్రమాద వార్త తెలియగానే అతడు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాడు. నాలుగో అంతస్తులో కొందరు చిక్కుకుపోయిన విషయం తెలుసుకుని పరిశ్రమ గేటు దూకి, తాడు సాయంతో నాలుగో అంతస్తులోకి చేరుకుని అదే తాడుతో ఇద్దర్ని సురక్షితంగా కిందికి దించాడు.అంతలో అగ్నిమాపక శకటం వచ్చింది.


వెంటనే అతడు తాడుతో కిందికి దిగి.. ఫైరింజన్‌కు ఉన్న భారీ నిచ్చెనను నాలుగో అంతస్తు వరకూ చేరవేశాడు. అక్కడ ఉన్న మిగతా ముగ్గురూ కిందికి దిగడానికి సాయపడ్డాడు.అతడు చూపిన ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు.

ఎమ్మెల్యే శంకర్‌ రూ.5వేలు రివార్డుగా ఇవ్వగా.. తీసుకోవడానికి బాలుడు నిరాకరించాడు. తనకు చేతనైన సాయం చేశానని, డబ్బు వద్దని చెప్పడంతో.. ఎమ్మెల్యేతో సహా అక్కడ ఉన్నవారంతా సాయిచరణ్‌ను ఎంతగానో కొనియాడారు. కాగా.. అగ్నిప్రమాదంలో రూ.12 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. సీఎం మెచ్చుకోవడంతో బాలుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Telangana and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 12:05 PM