Share News

Mylavaram: ఓడిస్తానంటున్న జగన్.. గెలిచి తీరుతానంటున్న వసంత.. ఇంత ధీమా ఎలా..!?

ABN , Publish Date - May 05 , 2024 | 11:42 AM

మైలవరం (Mylavaram) నియోజకవర్గ తాగు, సాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యమని మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్రహీంపట్నం మండల తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. 5 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్‌తో (Vasantha Krishna Prasad) ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి..

Mylavaram: ఓడిస్తానంటున్న జగన్.. గెలిచి తీరుతానంటున్న వసంత.. ఇంత ధీమా ఎలా..!?

  • ఇబ్రహీంపట్నం తాగునీటి సమస్య పరిష్కరిస్తా

  • 5 నెలల్లో అందుబాటులోకి చింతలపూడి

  • బూడిద కాలుష్యం నుంచి విముక్తి

  • ఎలాగైనా నన్ను ఓడించాలన్నదే జగన్‌ లక్ష్యం

  • రూ.కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు

  • అయినా ప్రజలు నన్ను గెలిపించటం ఖాయం

  • మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌

మైలవరం (Mylavaram) నియోజకవర్గ తాగు, సాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యమని మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్రహీంపట్నం మండల తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. 5 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్‌తో (Vasantha Krishna Prasad) ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి.


Vasantha-Krishna-Prasad.jpg

ప్రచారం ఎలా జరుగుతోంది..?

ఐదేళ్ల జగన్‌ (YS Jagan) పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జగన్‌కు అభివృద్ధి అంటేనే గిట్టదు. పరిశ్రమలు లేవు. యువతకు ఉపాధి లేదు. 90 శాతం పూర్తయిన తాగు, సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేయలేని దుస్థితి. చింతలపూడి ఎత్తిపోతల మైలవరం నియోజకవర్గ ప్రజలకు ఒక వరం. 90శాతం పూర్తయిన దాన్ని పూర్తిచేసి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు జగన్‌ దేవుడయ్యేవాడు. గుంతల రోడ్లు, సాగునీటి సమస్య ఇక్కడి ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాని మూడు రాజధానుల అంశంతో కక్షసాధింపునకే జగన్‌ పరిమితమయ్యాడు. అభివృద్ధి అనే పదానికే అర్థం తెలియని వ్యక్తి కాబట్టి దూరదృష్టితో ఆలోచన చేయడం చేతకాలేదు. ఈ విషయాలన్నీ నేను చెబుతున్నవి కాదు. ప్రచారంలో ప్రజలే నాకు చెబుతున్న అంశాలు. ప్రతి ఎన్నికల్లోనూ మా కుటుంబమంతా ప్రచారం చేయడం ఆనవాయితీ. గత ఎన్నికలకు ముందు కూడా ప్రచారంలో అందరం పాల్గొన్నాం. ఈసారీ అదే వినమ్రతతో ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నాం. జనాల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

ప్రత్యర్థి బలాలు.. బలహీనతలు

‘నన్ను కాదని వెళ్లాడు కాబట్టి ఏమైనా చేసి వసంతను ఓడించాలి’ అనే పట్టుదలతో జగన్‌ రెడ్డి ఉన్నారు. పేదలకు, పెత్తందారులకు నడుమ పోటీ జరుగుతుందని చెబుతున్నారు. నేను పెత్తందారు అయితే 2019లో నాకు టికెట్‌ ఎందుకు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి పేదవాడు అయితే జగన్‌ రెడ్డి కోట్లాది రూపాయలు నియోజకవర్గానికి పంపి తన సొంత సామాజికవర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. రాయలసీమ నుంచి 70–80 మందిని దింపారు. ఇవన్నీ పేదవాళ్లు చేసే పనులా.. పెత్తందారులు చేసే పనులా..? జగన్‌ రెడ్డి ఎన్ని కోట్లు గుమ్మరించినా.. ఎంతమందిని దింపినా.. మైలవరం నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం ఖాయం.


Vasantha-Krishna-Prasad-1.jpg

ప్రజలకు మీరిచ్చే ప్రధాన హామీలు

నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్రహీంపట్నం మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. 5 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేస్తాం. టీడీపీ హయాంలో సాగర్‌ ఆయకట్టు రైతుల ఇబ్బందులు గుర్తించి చింతలపూడి ద్వారా నికర జలాలు అందించేందుకు రూ.4100 కోట్లు ఖర్చు చేశారు. 90 శాతం పనులు పూర్తి చేశారు. ఈ ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయింది. మైలవరం రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా. చివరిగా కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు బూడిద కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తా. ఓ వైసీపీ ప్రజాప్రతినిధి బూడిదను దోచుకుంటూ నిన్నటి వరకు నెపాన్ని నాపై నెట్టారు. కానీ ఇప్పటికీ బూడిద దందా కొనసాగుతూనే ఉంది. దీనికెవరు బాధ్యులు? టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బూడిద దందాపై కఠినచర్యలు తీసుకుంటాం.

నేతల నడుమ సమన్వయం ఎలా ఉంది..?

నేను వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం వల్ల తొలుత కాస్త ఇబ్బందులున్న మాట వాస్తవమే. కానీ నాతోపాటు వైసీపీ నుంచి వచ్చిన వారిని, టీడీపీ క్యాడర్‌ను కూర్చోబెట్టి సమావేశాలు నిర్వహించాం. దీంతో అందరూ కలిసి ముందుకు వెళుతున్నాం. నేతలందరూ మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నారు. అంతిమంగా టీడీపీని గెలిపించాలన్న కసి క్యాడర్‌లో కనిపిస్తోంది.

Vasantha.jpg

For Latest News and Telugu News click here

Updated Date - May 05 , 2024 | 11:48 AM