Share News

Lok Sabha Elections: కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ.. నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ అభ్యర్థి

ABN , Publish Date - Apr 29 , 2024 | 02:52 PM

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్‌ను సోమవారంనాడు ఉపసంహరించుకున్నారు. తమ పార్టీలో చేరమంటూ ఆయనను బీజేపీ ఆహ్వానించింది.

Lok Sabha Elections: కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ.. నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ అభ్యర్థి

ఇండోర్: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఇండోర్ (Indore) కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ (Akshay Kanti Bam) తన నామినేషన్‌ను సోమవారంనాడు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ ఉపసంహరణ కోసం బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మండోలాతో కలిసి ఆయన కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం కాంగ్రెస్‌ పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానిపై బమ్‌ను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మే 13న ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగాల్సి ఉంది.


బీజేపీలోకి విజయవర్గీయ ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీ నామినేషన్‌ను బమ్ ఉపసంహరించున్నట్టు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో బీజేపీలోకి బమ్‌ను స్వాగతిస్తున్నామంటూ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కైలాష్ విజయవర్గీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ సారథ్యంలో అక్షయ్ బాంత్ బమ్‌ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామంటూ ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, విదిశ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కాంగ్రెస్‌ పార్టీకి చురకలు వేశారు. అభ్యర్థులు సైతం పార్టీలో ఇమడలేని పరిస్థితిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్)లో ఉందని ఆయన విమర్శించారు.

LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్


ఇండోర్ ఎన్నికలు..

మే 13న ఇండోర్‌తో సహా రాష్ట్రంలోని 7 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నాలుగు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26న మొదటి, రెండో విడత ఎన్నికలు జరుగగా, తదుపరి రెండు విడతలు మే 7, మే 13న జరుగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పార్లమెంటరీ ప్రాతినిధ్యం ప్రకారం 29 లోక్‌సభ స్థానాలతో మధ్యప్రదేశ్ 6వ అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. వీటిలో ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 10 సీట్లు రిజర్వ్ కాగా, తక్కిన 19 అన్‌-రిజర్వ్‌డ్ సీట్లు.

Read Latest news and National News here..

Updated Date - Apr 29 , 2024 | 02:52 PM