దారుణం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను బంధించిన యాజమాన్యం.. ఆహారం తినకుండా నిర్బంధం.. చివరకు..
ABN , First Publish Date - 2022-09-07T22:36:50+05:30 IST
జైపూర్ (Jaipur)లోని సుబోధ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం దారుణంగా వ్యవహరించింది.
జైపూర్ (Jaipur)లోని సుబోధ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం దారుణంగా వ్యవహరించింది. ఫీజులు చెల్లించనందుకు విద్యార్థులను లైబ్రరీలో బందీలుగా ఉంచింది. 40 మందికి పైగా విద్యార్థులను పాఠశాల లైబ్రరీలో 4 గంటల పాటు బంధించారు. విషయం తెలిసుకున్న వెంటనే తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నిరసన ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం విద్యార్థులను లైబ్రరీ నుంచి బయటకు తీసుకొచ్చారు.
ఇది కూడా చదవండి..
బయటకు కనిపిస్తున్న ఎముకలు.. ఏడేళ్ల వయసున్న ఈ బాలిక బరువు కేవలం 7 కేజీలే.. తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోతే..
సుబోధ్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులను మంగళవారం మొదటి పీరియడ్ ముగిసిన తర్వాత లైబ్రరీకి పిలిచారు. వారిని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లైబ్రరీలో బంధించి ఉంచారు. ఆ సమయంలో విద్యార్థులను వాష్రూమ్కు వెళ్లనివ్వలేదు. ఆహారం తినడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. వారిలో కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మొబైల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. పేరెంట్స్ వెంటనే పాఠశాలకు చేరుకుని నిరసన ప్రారంభించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆరోపణలపై పాఠశాల ప్రిన్సిపాల్ స్పందించారు. ఫీజు కట్టలేదనే కారణంతో తాము ఎవరినీ వేధించలేదని తేల్చి చెప్పారు. కొందరు వ్యక్తులు కావాలనే తమ స్కూలుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా, పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యా శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.