Chandigarh: బూస్టర్ డోస్ వేసుకున్న ఛండీగఢ్ వాసులకు బంపరాఫర్.. ఫ్రీ పుడ్ అంటూ ప్రకటన..
ABN , First Publish Date - 2022-08-02T00:29:30+05:30 IST
కరోనా ఇంకా పూర్తి స్థాయిలో నిష్క్రమించలేదు. ఇంతకు ముందులా కాకపోయినా ఇప్పటికీ దేశంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
కరోనా ఇంకా పూర్తి స్థాయిలో నిష్క్రమించలేదు. ఇంతకు ముందులా కాకపోయినా ఇప్పటికీ దేశంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ (precaution dose) తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశ ప్రజలందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ అందిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్`లో భాగంగా 75 రోజుల పాటు ఈ ఉచిత డోసులు అందిస్తామని తెలిపింది. అయినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు.
ఇది కూడా చదవండి..
Bihar Student: ఇదెక్కడి విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. కారణమేంటంటే..
మూడో డోసు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఛండీగఢ్ (Chandigarh) కు చెందిన సంజయ్ రాణా అనే వ్యాపారి కూడా తన వంతు ప్రయత్నం ప్రారంభించాడు. మూడో డోసు వేసుకున్న వారికి తన షాపులో ఉచితంగా ఛోల్ భతుర్ (Chhole Bhature) ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. తన ద్విచక్రవాహనంపై ఛండీగఢ్ వీధుల్లో సంజయ్ ఛోల్ భతురేను విక్రయిస్తుంటారు. సెనగలతో చేసే ఈ మసాలా పూరీ ఉత్తర భారతదేశంలో బాగా ఫేమస్.
బూస్టర్ డోస్ వేసుకున్న రోజున తన దగ్గరకు వస్తే ఛోల్ భతురేను సంజయ్ ఉచితంగా ఇస్తానంటున్నాడు. వ్యాక్సిన్ వేసుకుని అందరూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నాడు. గత ఏడాది తొలి డోసు వేసుకున్న వారికి కూడా సంజయ్ ఉచితంగా ఛోల్ భుతరే అందించాడు. ఈ విషయాన్ని మన్కీ బాత్లో ప్రస్తావించి సంజయ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు (PM Modi praises) కురిపించారు.