ఆయిల్పామ్ ఎంజీపీ రూ.25 వేలుగా నిర్ణయించాలి
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:27 AM
సాగు వ్యయం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని తాజా ఆయిల్పామ్ గెలల కనీస హామీ ధరను (ఎంజీపీ) క్వింటాల్కు రూ.25 వేలుగా నిర్ణయించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
100 శాతం పప్పుధాన్యాల సేకరణకు అనుమతివ్వాలి
తెలంగాణలో ఆయిల్పామ్ పరిశోధనా కేంద్రం,
కొత్తగూడెంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలి
కేంద్రానికి మంత్రి తుమ్మల వినతి.. కేంద్ర మంత్రులతో భేటీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): సాగు వ్యయం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని తాజా ఆయిల్పామ్ గెలల కనీస హామీ ధరను (ఎంజీపీ) క్వింటాల్కు రూ.25 వేలుగా నిర్ణయించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ అయ్యారు. ఐసీఏఆర్-ఐఐఓపీఆర్ అనుబంధంగా రాష్ట్రంలో ప్రాంతీయ ఆయిల్పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కందులు, పెసలు, మినుములు, శనగ వంటి పప్పుధాన్యాలు, నూనెగింజల సేకరణ పరిమితిని ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెరుగుతున్న సాగుకు అనుగుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు కార్యాలయం ప్రారంభించాలని కోరారు. సూక్ష్మ సాగునీటి పద్ధతుల విస్తరణకు అదనపు నిధులు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణకూ అదనంగా పీఎం-ఆర్కేవీవై (పీఎంఏవైజీ) ఇళ్లు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను తుమ్మల కోరారు.
ఇవి కూడా చదవండి
అమెరికా పునాదులు కదిలిస్తాం.. కొత్త యుద్ధ వ్యూహం సిద్ధమన్న ఇరాన్