రాయదుర్గం భూముల వేలానికి తొలగిన అడ్డంకులు.. సుప్రీం తీర్పు
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:02 PM
రాయదుర్గం భూముల వేలానికి మార్గం సుగమమైంది. TGIIC నిర్వహిస్తున్న వేలం ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, వేలం కొనసాగించేందుకు అడ్డంకులు తొలగినట్టయ్యాయి. దీంతో ఈ భూముల వేలం ప్రక్రియ ముందుకు సాగనుంది.
హైదరాబాద్, ఆగస్టు 21: రాయదుర్గం పాన్మక్తా భూముల వేలం ప్రక్రియలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టీజీఐఐసీ నిర్వహిస్తున్న భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వేలం ప్రక్రియను సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్ సింహారావు దాఖలు చేసిన WP No.1028/2026 పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏదైనా అభ్యంతరం ఉంటే హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ మోహన్ ఉన్నారు. దీంతో రాయదుర్గం పాన్మక్తా భూముల వేలం కొనసాగించేందుకు టీజీఐఐసీకి న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్టయ్యాయి.
రాయదుర్గం పాన్మక్తా ప్రాంతంలోని రెండు సర్వే నంబర్లలో సుమారు 11 ఎకరాల భూముల విక్రయానికి టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో ఎకరాకు రూ.175 కోట్లను కనీస ధరగా నిర్ణయించింది. ఈ వేలాన్ని సవాలు చేస్తూ ప్రణయ్ సింహారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, రక్షించాల్సిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. అయితే పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.
కంచ గచ్చిబౌలి భూములకు, ప్రస్తుతం వేలం వేయనున్న భూములకు ఎలాంటి సంబంధం లేదని, అవి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. టీజీఐఐసీ నోటిఫికేషన్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అంతే కాదు తదుపరి పిటీషన్పై విచారణకు నిరాకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..
నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..