మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
ABN , Publish Date - Feb 11 , 2026 | 07:14 AM
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు,116 పురపాలక సంఘాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు.
పకడ్బందీగా బందోబస్తు
పోలింగ్ నేపథ్యంలో బందోబస్తుపై డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా 8,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. వీటిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తాము. 1,302 అత్యంత సున్నితమైన, 1,926 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాము. అక్కడ స్ర్టైకింగ్ ఫోర్స్ను మోహరిస్తాము. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 167 స్ట్రాటజిక్ నిఘా బృందాలను రంగంలోకి దించాము’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్కు ఇబ్బందేనా..
హైదరాబాద్లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..