Share News

గ్యాస్ బుకింగ్స్ పేరుతో మోసాలు.. ప్రజలకు సైబర్ సింబా హెచ్చరిక..

ABN , Publish Date - Mar 11 , 2026 | 01:41 PM

డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక జనం నుంచి లక్షల్లో డబ్బు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సింబా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది.

గ్యాస్ బుకింగ్స్ పేరుతో మోసాలు.. ప్రజలకు సైబర్ సింబా హెచ్చరిక..
LPG gas booking scam alert

హైదరాబాద్, మార్చి 11: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆయిల్, గ్యాస్, ఎరువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. హోటల్లు మూతపడుతున్నాయి. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక జనం నుంచి లక్షల్లో డబ్బు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సింబా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది.

cyber-simbaa.jpg


ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ మోసాలకు సంబంధించి సైబర్ అవేర్‌నెస్ అలర్ట్‌ ఇచ్చింది. ఆ అలర్ట్‌లో.. ‘గత కొద్దిరోజుల నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా చాలా మంది ఆన్‌లైన్‌లో క్విక్ బుకింగ్స్, అదనపు సిలిండర్ల కోసం వెతుకుతున్నారు. ఈ పరిస్థితిని సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుని ఫేక్ వెబ్‌ సైట్లు, ఫేక్ బుకింగ్ లింక్స్, మోసపూరిత మెసేజ్‌లు తయారు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎల్పీజీ గ్యాస్ స్కామ్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఆన్‌లైన్ పేమెంట్ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని అంటుంటే అది కచ్చితంగా సైబర్ మోసమే.


సైబర్ నేరగాళ్లు ఫేక్ ఎల్పీజీ బుకింగ్ వెబ్ సైట్లను తయారు చేస్తారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వెంటనే డెలివరీ చేస్తామంటూ ఫేక్ ఎస్‌ఎమ్‌ఎస్, వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా యాడ్స్ వస్తుంటాయి. ఎల్పీజీ బుకింగ్స్ కోసం లేదా పేమెంట్ కోసం అనుమానంగా అనిపించే లింకులపై క్లిక్ చేయకండి. కంపెనీకి చెందిన అధికారిక వెబ్ ‌సైట్ల ద్వారానే ఎల్లప్పుడూ సిలిండర్లు బుక్ చేసుకోండి. ఓటీపీ, బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్‌లను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. ఫేక్ వెబ్ సైట్లు మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను దొంగిలించే అవకాశం ఉంది. మీరు గనుక సైబర్ నేరానికి గురై ఉంటే వెంటనే 1930కు ఫోన్ చేయండి’ అని సైబర్ సింబా తెలిపింది.


ఇవి కూడా చదవండి

ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో నిలిచిపోయిన భోజన సదుపాయం

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి 'సుప్రీం' అనుమతి.. అసలేంటీ కేసు.?

Updated Date - Mar 11 , 2026 | 01:56 PM