హైదరాబాద్: సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్కు 20 వసంతాలు..
ABN , Publish Date - Aug 23 , 2026 | 08:57 PM
20 ఏళ్ల క్రితం మొదలైన ఓ ప్రయోగం.. ఇప్పుడు సైబరాబాద్ భద్రతకు బలమైన భాగస్వామిగా మారింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడిన ‘సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. మహిళల భద్రత నుంచి సైబర్ అవగాహన వరకు పలు కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, ఆగస్టు 23: సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 2006 ఆగస్టు 23న పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మోడల్లో ఏర్పాటైన ఈ కౌన్సిల్.. సైబరాబాద్ పరిధిలో ప్రజా భద్రత, ఉద్యోగులు, మహిళల రక్షణతో పాటు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఐటీ కారిడార్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. మహిళల కోసం ‘షీ షటిల్స్’, విద్యార్థుల్లో భద్రతా అవగాహన పెంచేందుకు ‘చైతన్య’ వంటి ప్రాజెక్టులను అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువైంది. పోలీసు శాఖ, ప్రైవేట్ సంస్థలు, వివిధ భాగస్వామ్య సంస్థల సమన్వయంతో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కౌన్సిల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కౌన్సిల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు. తాను సైబరాబాద్ కమిషనర్గా ఉన్న సమయంలో కొంతకాలం నిర్వీర్యంగా ఉన్న కౌన్సిల్కు మళ్లీ జీవం పోసి బలోపేతం చేశానని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజా భద్రతను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చనే దానికి సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మంచి ఉదాహరణగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో మారుతున్న సాంకేతికత, కొత్త సవాళ్లకు అనుగుణంగా మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టి ప్రజా భద్రతకు సేవలందించాలని డీజీపీ ఆకాంక్షించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఐటీ సంస్థల భద్రతను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో రెండో టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?
ఆసీస్పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ చారిత్రాత్మక ఘనత