రైతుల ఆదాయాన్ని పెంచడమే బ్యాంకుల లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN , Publish Date - Aug 19 , 2026 | 04:16 PM
రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులే బ్యాంకుల వద్దకు వచ్చే పరిస్థితి కాకుండా.. బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లి అర్హత ఉన్న ప్రతి రైతుకూ సకాలంలో రుణాలు అందించాలని స్పష్టం చేశారు..
హైదరాబాద్, ఆగస్టు 19: స్టేట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు. అర్హత ఉన్న ప్రతి రైతుకూ సకాలంలో రుణాలు అందేలా బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలని సూచించారు. రుణాలు ఇవ్వడమే కాకుండా రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి 2026 జూన్ వరకూ రూ.52,337 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. డెయిరీ, మత్స్య, ఉద్యాన, పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు మరింతగా రుణాలు పెంచాలని ఆదేశించారు. రుణం చెల్లించలేని రైతుల ఆదాయం ఎందుకు తగ్గిందో విశ్లేషించి, సమస్యలకు పరిష్కారాలు చూపాలని బ్యాంకర్లకు సూచించారు. MSMEలకు రుణం మంజూరు చేయడమే కాకుండా సకాలంలో నిధులు అందించడం ముఖ్యమని అన్నారు. CGTMSE కింద రూ.4,463 కోట్ల విలువైన 16,265 ప్రతిపాదనలు ఆమోదించినట్లు వెల్లడించారు. రుణాల కోసం వ్యాపారులను పూచీకత్తు నిబంధనలతో ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు.
క్యూర్, ప్యూర్, రేర్కు అనుగుణంగా ప్రత్యేక బ్యాంకింగ్ వ్యూహాలను రూపొందించాలని భట్టి విక్రమార్క సూచించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ‘బ్యాంకింగ్ రోడ్మ్యాప్’ సిద్ధం చేయాలని అన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. జనధన్ ఖాతాల్లో 19.13 లక్షల ఖాతాలు జీరో బ్యాలెన్స్లో ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికీ బ్యాంకింగ్ సేవలు అందేలా బిజినెస్ కరస్పాండెంట్లను మరింత క్రియాశీలం చేయాలని ఆదేశించారు.
Also Read:
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..
నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్పై ఈడీ దర్యాప్తు ముమ్మరం