Share News

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. రానున్న రోజుల్లో భారీగా పెరగనున్న మొబైల్స్ ధరలు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:29 PM

త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ జేబుకు కాస్త ఎక్కువ చిల్లు పడక తప్పదు. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశముందని ప్రముఖ మొబైల్ ఫోన్స్ కంపెనీ 'నథింగ్' సీఈఓ కార్ల్ పీ హెచ్చరించారు.

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. రానున్న రోజుల్లో భారీగా పెరగనున్న మొబైల్స్ ధరలు!
Smartphone Prices Set to Rise as Memory Chip Costs Surge Amid AI Boom: Carl Pei Warns

ఆంధ్రజ్యోతి, జూన్ 12: మీరు త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు భారీగా డబ్బు ఖర్చు చేయక తప్పదు. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ టెక్ కంపెనీ 'నథింగ్' (Nothing) సీఈఓ కార్ల్ పీ (Carl Pei) హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా మెమొరీ చిప్‌ల (RAM & Storage) ధరలు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.


ముగిసిన 15 ఏళ్ల ట్రెండ్:

కార్ల్ పీ సోషల్ మీడియా 'X' ఖాతాలో ఈ విషయాన్ని సుదీర్ఘంగా వివరించారు. గత 15 సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ ఒకే ఒక నమ్మకంపై నడిచింది.. అదేంటంటే, 'ఏటా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఫోన్ విడిభాగాల (Components) ధరలు తగ్గుతూ వస్తాయి. దీనివల్ల కంపెనీలు తక్కువ ధరలోనే ఎక్కువ ర్యామ్ (RAM), మెరుగైన స్టోరేజ్, డిస్‌ప్లేలను వినియోగదారులకు అందించగలుగుతాయి'. కానీ, ఇప్పుడు ఆ కాలం చెల్లిపోయిందని, స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో ఆర్థిక సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు.


స్మార్ట్‌ఫోన్ మెమొరీని లాగేసుకుంటున్న 'AI' (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)

ఈ సంక్షోభానికి అసలు కారణం 'AI' విప్లవమేనని కార్ల్ పీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం విపరీతంగా పెరిగింది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు భారీ AI డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. ఈ డేటా సెంటర్లకు అత్యధిక సామర్థ్యం గల మెమొరీ చిప్‌లు అవసరమవుతాయి.

దీనికోసం మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ముందస్తుగానే మెమొరీ చిప్ సామర్థ్యాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల చిప్స్ తయారుచేసే శాంసంగ్, మైక్రాన్, ఎస్‌కే హైనిక్స్ వంటి కంపెనీలు తమ దృష్టిని అటు వైపు మళ్లించాయి. ఫలితంగా, చరిత్రలో మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ, AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో నేరుగా పోటీ పడాల్సి వస్తోంది.

సప్లై తక్కువగా ఉండి, డిమాండ్ విపరీతంగా ఉండటంతో మెమొరీ చిప్‌ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో స్మార్ట్‌ఫోన్‌లలో వాడే ఒక మెమొరీ మాడ్యూల్ ధర $20 (సుమారు రూ.1,600) లోపు ఉండేది.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం, ప్రీమియం/ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కోసం అదే మెమొరీ ధర $100 (సుమారు రూ.8,300) దాటిపోయే ప్రమాదం ఉంది. అంటే కేవలం ఫోన్లోని ఒక భాగం ధరలోనే దాదాపు 3 నుంచి 5 రెట్లు పెరుగుదల కనిపిస్తోంది.

నథింగ్ ఫోన్ల ధరలు కూడా పెరుగుతాయి

ఈ సంక్షోభం నుంచి తమ కంపెనీ కూడా మినహాయింపు కాదని, రాబోయే రోజుల్లో నథింగ్ స్మార్ట్‌ఫోన్ల ధరలను కూడా పెంచక తప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ త్రైమాసికంలో రాబోయే సరికొత్త UFS 3.1 స్టోరేజ్ కలిగిన ఫోన్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.


ఇవీ చదవండి:

నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత

Updated Date - Jun 12 , 2026 | 06:37 PM