ఈ లోపాల మాటేమిటి?
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:28 AM
ఇంగ్లండ్తో సెమీ్సలో బౌలర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. బ్యాటర్ల రాణింపుతో భారత్ 253/7 స్కోరుతో అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది.....
ఫైనల్ ముందు భారత్కు సవాళ్లు
టీ20 వరల్డ్కప్ టైటిల్ను నిలబెట్టుకునేందుకు టీమిండియా ఆదివారం న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్లో ఇంగ్లండ్పై ఉత్కంఠ విజయం అందుకున్న సూర్యకుమార్ సేన దృష్టంతా ఇప్పుడు చాంపియన్గా నిలవడంపైనే ఉంది. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఈ మ్యాచ్ తుదిపోరు కూడా జరుగనుంది. అయితే మూడేళ్ల క్రితం ఆ పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం ఎదురవడంతో.. ప్రస్తుత మ్యాచ్ ఫలితంపైనా అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి తోడు జట్టులో అన్ని విభాగాలు పటిష్టంగా ఉన్నాయా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. మరి.. వీటిని అధిగమిస్తేనే కప్పుపై ఆశలు.
బౌలింగ్పై ఆందోళన
ఇంగ్లండ్తో సెమీ్సలో బౌలర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. బ్యాటర్ల రాణింపుతో భారత్ 253/7 స్కోరుతో అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది. మనకు వరల్డ్ క్లాస్ బౌలర్లు అండగా ఉన్న వేళ.. ప్రత్యర్థి ఈ స్కోరు దరిదాపుల్లోకి కూడా రాదేమో అనే ధీమా అందరిలోనూ కనిపించింది. కానీ తీరా మ్యాచ్ ముగిశాక భారత్ గెలిచింది కేవలం 7 పరుగుల తేడాతోనే కావడం ఒకింత షాకింగ్గా మారింది. ఆ మ్యాచ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎకానమీ 16 కాగా.. అక్షర్ పటేల్ది 11.7గా ఉంది. దీంతో కెప్టెన్ సూర్యకు ముందుగానే బుమ్రాతో ఓవర్లు వేయించాల్సి వచ్చింది. ఇక చివరి ఓవర్ కోసం అక్షర్, శివమ్ దూబే తప్ప మరో ఆప్షన్ లేకపోయింది. అందరూ భయపడినట్టు దూబేకే బంతి ఇవ్వగా, ఆర్చర్ సిక్సర్ల మోతకు అతను 22 రన్స్ ఇచ్చుకున్నాడు. వాంఖడే ఫ్లాట్ ట్రాక్పై బుమ్రా మినహా మరో బౌలర్ ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా, పరిస్థితులు బాగాలేనప్పుడు ఆదుకునేందుకు ఆరో బౌలర్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఇక ఫైనల్కు వేదికపై వరుణ్కు మెరుగైన రికార్డు ఉండడంతో అతడిని కొనసాగిస్తారా? లేదంటే కుల్దీప్ను తీసుకుంటారా? అన్నది చూడాలి. బుమ్రా ఒక్కడే ఫైనల్లో ఆదుకోలేడు కాబట్టి కోచ్, కెప్టెన్ తమ ప్లాన్ ‘బి’ గురించి ఆలోచించాల్సిందే.
ఫీల్డింగ్లో..
సెమీస్లో అక్షర్ పటేల్ రెండు అద్భుత క్యాచ్లతో ఆకట్టుకున్నాడు. కానీ ఓవరాల్గా గమనిస్తే మాత్రం అంత సీన్ లేదు. టోర్నీలో ఓవరాల్గా 13 క్యాచ్లను వదిలేసి ఇతర జట్లకన్నా మనం ముందుండడం గమనార్హం. క్యాచ్లు జారవిడిచే విషయంలో గతేడాది నుంచి కూడా అభిషేక్లో ఎలాంటి మెరుగుదలలేదు. అలాగే మోదీ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు కాకుండా రింగ్ ఆఫ్ ఫైర్ తరహాలో వెలుతురు ఉంటుంది కాబట్టి ఫీల్డింగ్ సవాల్గా మారుతుంది. దీనికి తగ్గట్టుగా ఫైనల్కు ముందే ఫీల్డర్లు క్యాచ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బ్యాటింగ్లో అండగా నిలిచేది ఎవరు?
కీలక ఫైనల్లో జట్టుకు అండగా నిలిచే బ్యాటర్ ఎవరనే సందేహం అందరి మదిలో నెలకొంది. శాంసన్ ఫామ్ అతిపెద్ద బలంగా మారింది. కానీ తనకు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించాల్సి ఉంది. అభిషేక్ శర్మ ఫామ్లేమితో ఇబ్బందిపడుతూ కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. అయినా తుది పోరులో అతడినే కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వ్ బెంచీలో స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూ సింగ్ మాత్రమే ఉన్నాడు. అతడి ఫామ్ కూడా మెరుగ్గా ఏమీ లేదు. అందుకే కుడి-ఎడమ కాంబినేషన్ కోసం శర్మనే కొనసాగిస్తూ తను ఫామ్లోకి రావాలని కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావడం లేదు. యూఎస్ఏపై అర్ధసెంచరీ మినహా ప్రభావం చూపలేదు. దీనికితోడు నాకౌట్ మ్యాచ్ల్లో అతడు 20 రన్స్ లోపే వెనుదిరిగిన రికార్డు ఉంది. ఐసీసీ ఫైనల్లో రోహిత్, విరాట్ మాదిరి ప్రస్తుత జట్టులో ఒత్తిడి లేకుండా ఆడే అనుభవం చాలా మందికి లేదు. అందుకే కివీస్ను ఓడించాలంటే లోపాలను సరిచేసుకుని జట్టంతా అద్భుతంగా చెలరేగాల్సిందే.