ఆర్సీబీ విజయోత్సవం లేదు
ABN , Publish Date - Jun 02 , 2026 | 03:08 AM
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాదీ ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవడంతో..ఆ జట్టు ఫ్యాన్స్ విజయ సంబరాలకోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో...
అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాదీ ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవడంతో..ఆ జట్టు ఫ్యాన్స్ విజయ సంబరాలకోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో జట్టు పరేడ్ ఉంటుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ వారికి నిరాశ కలిగించే నిర్ణయాన్ని ఆర్సీబీ యాజమాన్యం తీసుకుంది. ఈసారి ‘విక్టరీ పరేడ్’ లేదని సోమవారం ప్రకటించింది. గత ఏడాది తొలిసారి బెంగళూరు ఐపీఎల్ టైటిల్ అందుకోవడంతో పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో చిన్నస్వామి స్టేడి యం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ఆర్సీబీ అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా నియమితులైన డీకే శివకుమార్ ప్రమాణస్వీకారోత్సవం కూడా ఉన్న నేపథ్యంలో ‘టైటిల్’ సంబరాలు జరపకూడదని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించిందట. ఈనెల మూడున శివకుమార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆ కార్యక్రమం జరిగే గవర్నర్ నివాసం చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో ఉంది. పైగా..బెంగళూరులో నిషేధాజ్ఞలు అమలులో ఉండడం కూడా విజయోత్సవాలు వద్దనుకోవడానికి మరో కారణం.
బెంగళూరులో సంబరాలు..: ఆర్సీబీ ఐపీల్ టైటిల్ నిలబెట్టుకోవడంతో బెంగళూరులో ఆదివారం రాత్రి ఫ్యాన్స్ సంబరాలు మిన్నంటాయి. ముందుజాగ్రత్తగా పోలీసులు ఆంక్షలు విధించినా..మ్యాచ్ ముగిశాక అభిమానులు భారీగా రోడ్లపైకి వచ్చి వేడుకలు నిర్వహించారు. అదేసమయంలో గత ఏడాది బెంగళూరు జట్టు విజయోత్సవాల సందర్భంగా తొక్కిసలాట జరిగి మృతి చెందిన 11 మంది ఫ్యాన్స్నూ వారు స్మరించుకున్నారు.
మ్యాచ్ విన్నర్లు చాలామందే ఉన్నారు : కోహ్లీ
ఈసారి టోర్నీ మధ్యలో జట్టు కొంత ఇబ్బందిపడినా కోలుకొని టైటిల్ సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని విరాట్ కోహ్లీ అన్నాడు. జట్టు సమతూకంగా, ఎంతో పటిష్టంగా ఉందని చెప్పాడు. ప్రతి మ్యాచ్లోనూ తానే ఆడాల్సిన అవసరంలేని స్థాయిలో ఆర్సీబీ ఉందని అన్నాడు.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం