ఆ ఒక్కటి రాజస్థాన్ పట్టేసింది
ABN , Publish Date - May 25 , 2026 | 04:38 AM
చావోరేవో మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ (32, 3/17) ఆల్రౌండ్ షోతోపాటు మిగతా బౌలర్లు రాణించడంతో.. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్త్ను సొంతం చేసుకొంది. ఐపీఎల్లో...
ప్లే ఆఫ్స్ షెడ్యూల్
క్వాలిఫయర్-1 మే 26 (మంగళవారం)
బెంగళూరు X గుజరాత్ (ధర్మశాల)
ఎలిమినేటర్ మే 27 (బుధవారం)
హైదరాబాద్ X రాజస్థాన్ (న్యూ చండీగఢ్)
క్వాలిఫయర్-2 మే 29 (శుక్రవారం)-న్యూ చండీగఢ్
ఫైనల్: మే 31 (ఆదివారం) - అహ్మదాబాద్
చెలరేగిన ఆర్చర్
ముంబైపై గెలిచి ప్లేఆఫ్స్కు
పంజాబ్, కోల్కతా అవుట్
ముంబై: చావోరేవో మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ (32, 3/17) ఆల్రౌండ్ షోతోపాటు మిగతా బౌలర్లు రాణించడంతో.. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్త్ను సొంతం చేసుకొంది. ఐపీఎల్లో ఆదివారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో రాజస్థాన్ 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ నాలుగో బెర్త్ను ఖరారు చేసుకోగా.. గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు), కోల్కతాల కథ ముగిసింది. బుధవారం జరిగే ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో 205/8 స్కోరు చేసింది. ధ్రువ్ జురెల్ (38), షనక (29) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో ముంబై ఓవర్లన్నీ ఆడి 175/9 స్కోరు మాత్రమే చేసి ఓడింది. సూర్య(60), హార్దిక్ పాండ్యా (34), విల్ జాక్స్ (33) పోరాడినా ఫలితం దక్కలేదు. బ్రిజేష్ శర్మ, బర్గర్, యశ్రాజ్ తలో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఆర్చర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
‘టాప్’ ఢమాల్: ఛేదనలో ఆర్చర్ దెబ్బకు ముంబై 38/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ (0), నమన్ ధీర్ (6)ను ఆర్చర్ పెవిలియన్ చేర్చాడు. రికెల్టన్ (12)ను బర్గర్, తిలక్వర్మ (3)ను బ్రిజేష్ వెనక్కిపంపాడు. ఈ దశలో జాక్స్తో కలసి ఐదో వికెట్కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సూర్య.. పాండ్యాతో కలసి ఆరో వికెట్కు 58 రన్స్ జోడించి ఆశలు రేపాడు. అయితే, జాక్స్, బాష్ (2) వికెట్లను యశ్ దక్కించుకోగా.. హార్దిక్ను ఆర్చర్ పెవిలియన్ చేర్చాడు. సూర్యను బర్గర్ రిటర్న్ క్యాచ్తో వెనక్కిపంపడంతో ముంబై ఓటమి లాంఛనమే అయింది. చివరి 2ఓవర్లలో ముంబై విజయానికి 40 రన్స్ కావాల్సిఉండగా.. శార్దూల్ (10నాటౌట్), చాహర్ (8), ఘజన్ఫర్ చేతులెత్తేశారు.
డెత్లో జోరు: టాపార్డర్ నిరాశపర్చినా..చివర్లో ఆర్చర్, జడేజా (19 నాటౌట్) బ్యాట్లు ఝుళిపించడంతో రాజస్థాన్ పోరాడగలిగే స్కోరు చేసింది. వీరిద్దరి దెబ్బకు ముంబై చివరి 5 ఓవర్లలో 73 రన్స్ సమర్పించుకొంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు జైస్వాల్ (27), వైభవ్ (4) తొలి వికెట్కు 33 పరుగులు జోడించారు. జైస్వాల్ను జాక్స్.. వైభవ్ను చాహర్ అవుట్ చేశారు. కెప్టెన్ రియాన్ పరాగ్ (14) విఫలమైనా.. జురెల్, షనక నాలుగో వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, దూకుడుగా ఆడుతున్న షనక రనౌట్ కాగా.. జురెల్ను బాష్ బౌల్డ్ చేశాడు. 16వ ఓవర్లో ఫెరీరా (18)ను చాహర్ వెనక్కిపంపడంతో రాజస్థాన్ 139/6తో స్వల్ప స్కోరుకే పరిమితమవుతుందా? అని అనిపించింది. కానీ, ఈ దశలో ఆర్చర్ ముంబై బౌలర్లపై అనూహ్యంగా ఎదురుదాడికి దిగడంతో స్కోరు వేగం పుంజుకొంది. శుభం దూబే (5)తో కలసి ఆర్చర్ ఏడో వికెట్కు 14 బంతుల్లోనే 35 పరుగులు జోడించాడు. 18వ ఓవర్లో దూబే, ఆర్చర్ను శార్దూల్ అవుట్ చేసినా.. 9వ నెంబర్లో బ్యాటింగ్కు దిగిన జడేజా, బర్గర్ (10 నాటౌట్) తొమ్మిదో వికెట్కు వేగంగా 30 రన్స్ జోడించడంతో.. రాజస్థాన్ స్కోరు అనూహ్యంగా 200 మార్క్ దాటింది.
స్కోరుబోర్డు
రాజస్థాన్: జైస్వాల్ (సి) బాష్ (బి) జాక్స్ 27, వైభవ్ (సి) నమన్ (బి) చాహర్ 4, జురెల్ (బి) బాష్ 38, పరాగ్ (సి) తిలక్ (బి) ఘజన్ఫర్ 14, షనక (రనౌట్) 29, ఫెరీరా (సి) బాష్ (బి) చాహర్ 18, ఆర్చర్ (సి) తిలక్ (బి) శార్దూల్ 32, శుభం (సి) నమన్ (బి) శార్దూల్ 5, జడేజా (నాటౌట్) 19, బర్గర్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 205/8; వికెట్ల పతనం: 1-33, 2-33, 3-54, 4-99, 5-119, 6-139, 7-174, 8-175; బౌలింగ్: చాహర్ 4-0-43-2, విల్ జాక్స్ 2-0-12-1, ఘజన్ఫర్ 3-0-45-1, రఘు 3-0-25-0, శార్దూల్ 4-0-41-2, బాష్ 4-0-38-1.
ముంబై: రోహిత్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 0, రికెల్టన్ (సి) వైభవ్ (బి) బర్గర్ 12, నమన్ (బి) ఆర్చర్ 6, సూర్య (సి అండ్ బి) బర్గర్ 60, తిలక్ (బి) బ్రిజేష్ 3, జాక్స్ (సి) జురెల్ (బి) యశ్ 33, హార్దిక్ (సి) బర్గర్ (బి) ఆర్చర్ 34, బాష్ (సి) ఫెరీరా (బి) యశ్ 2, శార్దూల్ (నాటౌట్) 10, చాహర్ (ఎల్బీ) బ్రిజేష్ 8, ఘజన్ఫర్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 175/9; వికెట్ల పతనం: 1-0, 2-18, 3-24, 4-38, 5-101, 6-149, 7-152, 8-158, 9-167; బౌలింగ్: ఆర్చర్ 4-0-17-3, బర్గర్ 4-0-43-2, బ్రిజేష్ 4-0-26-2, జడేజా 2-0-24-0, యశ్ 4-0-44-2, షనక 2-0-21-0.
వైభవ్ సూర్యవంశీ (6బంతుల్లో 4) ఈ మ్యాచ్లో ఘోరంగా విఫలమైనా.. ఓ టీ20 టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన టీనేజర్గా రికార్డు సృష్టించాడు. మొత్తం 583 పరుగులు సాధించిన వైభవ్.. 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో దేవ్దత్ పడిక్కళ్ (580 పరుగులు) నమోదుచేసిన రికార్డును అధిగమించాడు.

ఇవి కూడా చదవండి:
అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్గా మహమ్మద్ షమీ..