సోషల్ మీడియా ఉప్పెన.. గంటల్లోనే 3 వేల నుంచి 3 లక్షల ఫాలోవర్స్
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:35 PM
ఐపీఎల్ ఓ ఆటగాడి జీవితాన్ని ఎలా మారుస్తుందో చెప్పడానికి ప్రఫుల్ హింగే ఓ నిలువెత్తు నిదర్శనం. సోమవారం రాత్రి వరకు ప్రఫుల్ హింగే ఎవరో కూడా చాలా మందికి తెలియదు. కానీ అద్భుత ప్రదర్శనతో కేవలం 6 బంతుల్లోనే ప్రపంచం మొత్తం తన పేరును వెతికేలా చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: అరంగేట్ర మ్యాచ్లోనే సంచలన ఆటతీరుతో సోషల్ మీడియా స్టార్గా మారిపోయాడు ప్రఫుల్ హింగే. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కొంటున్న బౌలింగ్ సమస్యకు మంచి పరిష్కారం లభించిందని ఆరెంజ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్పై ఒకే ఓవర్లో 3 వికెట్లు.. ఓవరాల్గా 4 వికెట్ల ప్రదర్శనతో ఘనమైన అరంగేట్రంతో ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉప్పెన వచ్చింది. యాక్టివ్గా ఉండే ప్రఫుల్కు ఫాలోవర్ల సంఖ్య లక్షల్లోకి చేరింది.
రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ముందువరకూ ప్రఫుల్ హింగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 3వేలు వరకు ఉంది. ఎప్పుడైతే ఒకే ఓవర్లో విధ్వంసకర బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్ను పెవిలియన్ పంపాడో.. క్షణాల్లో ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. కేవలం గంటల వ్యవధిలోనే 3 వేల నుంచి 3 లక్షలు దాటేసింది. ప్రస్తుతం అతడి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 3.20 లక్షలుగా ఉంది.
గతంలో ప్రఫుల్ హింగే పోస్టులకు వేలల్లో వచ్చే వ్యూస్.. ఇప్పుడు మిలియన్లకు చేరింది. తన తొలి ఓవర్ను తల్లిదండ్రులు చూస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ఆ వీడియోను ఇప్పటికే 4.6 మిలియన్ల మంది వీక్షించడం గమనార్హం. భవిష్యత్తులో ఎన్ని మ్యాచులు ఆడుతాడో తెలియదు కానీ.. ఆడిన తొలి మ్యాచ్ మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ప్రదర్శన చేశాడు ప్రఫుల్ హింగే.
ఇవి కూడా చదవండి:
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస ఓటములు.. టీమిండియా మాజీ ప్లేయర్
కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు: మాజీ క్రికెటర్