Share News

ఒక్క రోజులో కూల్చేశారు

ABN , Publish Date - Aug 18 , 2026 | 05:54 AM

ఆతిథ్య శ్రీలంక కంచుకోట గాలె మైదానంలో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాటింగ్‌తో పాటు మూడో రోజు సోమవారం బౌలింగ్‌లోనూ గిల్‌ సేన అదరగొట్టింది. స్పిన్నర్లు మానవ్‌ సుతార్‌ (4/76), రవీంద్ర జడేజా (3/57) సుడులు...

ఒక్క రోజులో కూల్చేశారు

మానవ్‌కు నాలుగు, జడేజాకు మూడు వికెట్లు

  • లంక తొలి ఇన్నింగ్స్‌ 284

  • సోనాల్‌ శతకం

  • స్పిన్‌ ఉచ్చులో శ్రీలంక విలవిల

తొలి టెస్టు భారత్‌కు భారీ ఆధిక్యం

గాలె: ఆతిథ్య శ్రీలంక కంచుకోట గాలె మైదానంలో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాటింగ్‌తో పాటు మూడో రోజు సోమవారం బౌలింగ్‌లోనూ గిల్‌ సేన అదరగొట్టింది. స్పిన్నర్లు మానవ్‌ సుతార్‌ (4/76), రవీంద్ర జడేజా (3/57) సుడులు తిరిగే బంతులతో లంకేయుల వెన్నువిరిచారు. అయితే ఓ దశలో ఫాలోఆన్‌ ప్రమాదంలో పడిన జట్టును సోనాల్‌ దినుష (100) శతకం, డిక్‌వెల్లా (80) అద్భుత ఆటతీరుతో గట్టెక్కించారు. వీరి బ్యాటింగ్‌ కారణంగా లంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేయగలిగింది. సిరాజ్‌, ప్రసిద్ధ్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ సాధించారు. వెలుతురులేమితో ఆట మరో 13 ఓవర్ల ముందే ముగియడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ బరిలో దిగలేకపోయింది. ప్రస్తుతం టీమిండియాకు 178 పరుగుల తిరుగులేని ఆధిక్యం దక్కింది. అంతకుముందు గిల్‌ సేన ఉదయం సెషన్‌ నాలుగో బంతికే 462 పరుగుల వద్ద ఆలౌటైంది.

తొలి సెషన్‌లోనే 5 వికెట్లు: శ్రీలంక ఇన్నింగ్స్‌లో సోనాల్‌, డిక్‌వెల్లా మినహా మరెవరూ రాణించలేకపోయారు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే పేసర్‌ సిరాజ్‌ ఓపెనర్‌ ఫెర్నాండో (0) వికెట్‌ తీశాడు. ఆ తర్వాత స్పిన్నర్‌ మానవ్‌ మ్యాజిక్‌ చేస్తూ.. చాందిమల్‌ (4), ఓపెనర్‌ ఉదార (27)లను వెనక్కి పంపాడు. కాసేపటికే కుల్దీప్‌, జడేజా ఒక్కో వికెట్‌ పడగొట్టడంతో లంక తొలి సెషన్‌లో 90/5 స్కోరుతో కష్టాల్లో పడింది. దీంతో జట్టుకు ఫాలోఆన్‌ తప్పదనిపించింది.

అద్భుత భాగస్వామ్యం: లంచ్‌ బ్రేక్‌ తర్వాత లంక ఆలౌట్‌ కావడం ఎంతోసేపు పట్టదనిపించినా.. డిక్‌వెల్లా-సోనాల్‌ జోడీ పట్టుదలతో ఈ సెషన్‌లో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయింది. డిక్‌వెల్లా ఎదురుదాడికి దిగడంతో 29 ఓవర్లలో 116 పరుగులు చేయగలిగింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో తను స్వీప్‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. సోనాల్‌ కూడా నిలకడ చూపడంతో.. ఇద్దరూ అర్ధసెంచరీలతో సెషన్‌ను ముగించారు. అయితే శతకం వైపు సాగుతున్న డిక్‌వెల్లాను ఆఖరి సెషన్‌ ఆరంభంలోనే పేసర్‌ ప్రసిద్ధ్‌ అవుట్‌ చేసి భారత్‌కు రిలీ్‌ఫనిచ్చాడు. దీంతో ఆరో వికెట్‌కు 146 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కేశర (2)ను జడేజా అవుట్‌ చేసి టెస్టుల్లో 350వ వికెట్‌ను పూర్తి చేశాడు. ఈ స్థితిలో సోనాల్‌-ప్రభాత్‌ (10) జోడీ కాస్త విసిగించింది. ఇక సెంచరీ సాధించిన వెంటనే సోనాల్‌ వెనుదిరిగాడు. వరుసగా మూడు ఓవర్లలోనే లంక చివరి మూడు వికెట్లు కోల్పోవడం గమనార్హం.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 462

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: నిషాన్‌ ఫెర్నాండో (సి) దేవ్‌దత్‌ (బి) సిరాజ్‌ 0, లాహిరు ఉడార (సి) జైస్వాల్‌ (బి) మానవ్‌ 27, చాందిమల్‌ (సి) పంత్‌ (బి) మానవ్‌ 4, కమిందు (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 14, ధనంజయ (సి) రాహుల్‌ (బి) జడేజా 21, సోనాల్‌ దినుష (ఎల్బీ) జడేజా 100, డిక్‌వెల్లా (సి) పంత్‌ (బి) ప్రసిద్ధ్‌ 80, కేశర (సి) గిల్‌ (బి) జడేజా 2, ప్రభాత్‌ (సి) జురెల్‌ (బి) మానవ్‌ 10, లాహిరు కుమార (స్టంప్‌) పంత్‌ (బి) మానవ్‌ 10, అసిత ఫెర్నాండో (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 79.4 ఓవర్లలో 284 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-27, 3-53, 4-59, 5-90, 6-236, 7-243, 8-274, 9-274, 10-284. బౌలింగ్‌: సిరాజ్‌ 9-3-29-1, ప్రసిద్ధ్‌ 14-0-47-1, మానవ్‌ 21.4-1-76-4, కుల్దీప్‌ 14-0-65-1, జడేజా 21-5-57-3.

3

అత్యధిక టెస్టు వికెట్లు (350) తీసిన మూడో లెఫ్టామ్‌ స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా. రంగన హెరాత్‌ (433), వెటోరి (362) ముందున్నారు.

4

సుదీర్ఘ ఫార్మాట్‌లో 4వేల రన్స్‌ + 350 వికెట్లు తీసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా. కపిల్‌ (5248, 434), బోథమ్‌ (5200, 383), వెటోరి (4531, 362) ఈ ఫీట్‌ సాధించారు.

5

భారత్‌ తరఫున 350+ వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా జడేజా. కుంబ్లే (619), అశ్విన్‌ (537), కపిల్‌ (434), హర్భజన్‌ (417) ముందున్నారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 05:54 AM