Share News

వర్షార్పణం

ABN , Publish Date - Jul 02 , 2026 | 05:32 AM

భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టీ20ని వరుణుడు అడ్డుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మొదటి టీ20లో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం..

వర్షార్పణం

ఇంగ్లండ్‌తో తొలి టీ20

రాణించిన అభిషేక్‌, అయ్యర్‌

భారత్‌ 189/7

చెస్టర్‌ లీ స్ట్రీట్‌ : భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టీ20ని వరుణుడు అడ్డుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మొదటి టీ20లో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం భారీ వర్షం కురిసింది. ఆపై ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా.. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక శివమ్‌ దూబే (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్‌) సత్తా చాటడంతో తొలుత భారత్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 189 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే రెండు షాక్‌లు తగిలాయి. నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ శాంసన్‌ (1) క్యాచవుట్‌కాగా..కిషన్‌ (0) రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అభిషేక్‌ భారీ షాట్లతో విరుచుకుపడగా, శ్రేయాస్‌ అతడికి అండగా నిలిచాడు. స్పిన్నర్‌ డాసన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన అభిషేక్‌ ఆపై పేసర్‌ సకీబ్‌ మహమూద్‌ బౌలింగ్‌లో 4, 6, 6, 4తో మొత్తం 21 పరుగులు రాబట్టాడు. అదే జోరులో ఉడ్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు దంచాడు. ఆఫ్‌స్పిన్నర్‌ విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ ఇంకో ఫోర్‌ కొట్టడంతో పవర్‌ ప్లేను 61/2తో భారత్‌ ముగించింది. రషీద్‌ బౌలింగ్‌తో సింగిల్‌తో అభిషేక్‌ (20 బంతులు) హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. జాక్స్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో శ్రేయాస్‌ 4, అభిషేక్‌ 6 సంధించడంతో..ఆ ఓవర్లో 15 రన్స్‌ వచ్చాయి.


అయితే తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన సామ్‌ కర్రాన్‌..అభిషేక్‌ను ఎల్బీగా పెవిలియన్‌ చేర్చి ఇంగ్లండ్‌కు భారీ ఊరటనిచ్చాడు. రివ్యూకి వెళ్లి ఇంగ్లండ్‌ ఈ వికెట్‌ సాధించింది. దాంతో 82 పరుగుల మూడో వికెట్‌కు భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశనుంచి ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో..శ్రేయాస్‌, తిలక్‌ వర్మ తెలివిగా బ్యాటింగ్‌ చేస్తూ సింగిల్స్‌, డబుల్స్‌తో స్కోరుబోర్డును నడిపించారు. మరోవైపు రెండో విడత బౌలింగ్‌కు వచ్చిన మహమూద్‌..తిలక్‌ వర్మ (13)ను అవుట్‌ చేశాడు. సింగిల్‌తో అర్ధ శతకం పూరించిన శ్రేయా్‌స..డాసన్‌ ఓవర్లో సిక్సర్‌తో బ్యాట్‌ ఝళిపించాడు. రషీద్‌ వేసిన 17వ ఓవర్లో దూబే సిక్సర్‌ కొట్టడంతో స్కోరుబోర్డు మళ్లీ ఊపందుకుంది. తన చివరి ఓవర్లో శ్రేయా్‌సను సకీబ్‌ ఎల్బీడబ్ల్యూ చేయగా, హర్షిత్‌ రాణా డకౌటయ్యాడు.

సంక్షిప్తస్కోరు

భారత్‌ 20 ఓవర్లలో 189/7 (శ్రేయాస్‌ అయ్యర్‌ 68, అభిషేక్‌ శర్మ 59, శివమ్‌ దూబే 42 నాటౌట్‌, తిలక్‌ వర్మ 13, సకీబ్‌ మహమూద్‌ 3/33, కర్రాన్‌ 1/25, ఆదిల్‌ రషీద్‌ 1/39).

ఇవి కూడా చదవండి:

ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

Updated Date - Jul 02 , 2026 | 05:32 AM