Share News

దేవ్‌దత్‌ శతక మోత

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:01 AM

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీ్‌సను భారత్‌ దీటుగా ప్రారంభించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (131 బ్యాటింగ్‌) అజేయ శతకంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు...

దేవ్‌దత్‌ శతక మోత

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 288/2

  • రాహుల్‌ అర్ధసెంచరీ

  • శ్రీలంకతో తొలి టెస్టు

గాలె: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీ్‌సను భారత్‌ దీటుగా ప్రారంభించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (131 బ్యాటింగ్‌) అజేయ శతకంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దీంతో శనివారం ఆరంభమైన తొలి టెస్టు మొదటి రోజున భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 288/2 స్కోరు సాధించింది. మ్యాచ్‌లో లంచ్‌ బ్రేక్‌ తర్వాత, ఆఖరి సెషన్‌ మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో పూర్తి ఓవర్లను ఆడకలేకపోయింది. కేఎల్‌ రాహుల్‌ (77) రిటైర్డ్‌ హర్ట్‌గా, యశస్వీ జైస్వాల్‌ (32) రనౌట్‌గా వెనుదిరిగారు. క్రీజులో పడిక్కళ్‌తో పాటు రిషభ్‌ పంత్‌ (27) ఉన్నాడు. లంక స్పిన్నర్‌ ప్రభాత్‌కు ఏకైక వికెట్‌ దక్కింది.

దేవ్‌దత్‌-రాహుల్‌ నిలకడ: టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. వికెట్‌ తీసేందుకు లంక బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది. ఓపెనర్లు రాహుల్‌, జైస్వాల్‌ స్వేచ్ఛగా ఆడడంతో ఆరంభంలోనే పరుగుల వేగం పెరిగింది. ఐదు ఫోర్లతో ఆకట్టుకున్న జైస్వాల్‌ 11వ ఓవర్‌లో రనౌట్‌ కావడంతో తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రాహుల్‌కు దేవ్‌దత్‌ జత కలవడంతో ఇన్నింగ్స్‌లో మరింత నిలకడ కనిపించింది. రెండేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న పడిక్కళ్‌ సమర్థవంతంగా లంక బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరూ రెండో సెషన్‌ను వికెట్‌ కోల్పోకుండా అర్ధసెంచరీలతో ముగించారు. అయితే చివరి సెషన్‌ ఆరంభానికి ముందు రాహుల్‌ కండరాల నొప్పి కారణంగా నడవడానికి ఇబ్బందిపడడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. అప్పటికి రెండో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. దీంతో కెప్టెన్‌ గిల్‌ (16) బరిలోకి దిగాడు. కాసేపటికే దేవ్‌దత్‌ 134 బంతుల్లోనే టెస్టుల్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. గిల్‌ను ప్రభాత్‌ అవుట్‌ చేశాడు. పంత్‌ దూకుడుగా ఆడడంతో చివర్లో పరుగులు వేగంగా వచ్చాయి. అయితే వెలుతురులేమి కారణంగా కాస్త ముందుగానే అంపైర్లు ఆటను ముగించారు.


10-Sports.jpg

జైస్వాల్‌ రనౌట్‌ వివాదాస్పదం

తొలి రోజు ఆటలో ఓపెనర్‌ జైస్వాల్‌ రనౌట్‌ అయిన తీరు వివాదాస్పదమైంది. 11వ ఓవర్‌లో రాహుల్‌ మిడాన్‌లో బంతి కొట్టి సింగిల్‌కు ప్రయత్నించాడు. అటు జైస్వాల్‌ ముందుకు కదిలేలోగా బౌలర్‌ నువంత ఆ బంతిని ఆపే ప్రయత్నంలో తనకు అడ్డం వచ్చాడు. దీంతో జైస్వాల్‌ కింద పడి లేచి మళ్లీ పరుగు కోసం వెళ్లాడు. కానీ అప్పటికే రాహుల్‌ నాన్‌ స్ట్రయిక్‌ ఎండ్‌లోకి రాగా, బంతి కీపర్‌ చేతుల్లోకి వెళ్లడంతో జైస్వాల్‌ కూడా వెనక్కి వచ్చాడు. అయితే రాహుల్‌ బ్యాట్‌ ముందు క్రీజులో ఉండడంతో జైస్వాల్‌ రనౌట్‌ కాక తప్పలేదు. మరోవైపు ఈ అవుట్‌లో లంక తప్పిదం ఉండడంతో వారు అప్పీల్‌ చేయకుండా క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తే బాగుండేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (రనౌట్‌) 32, రాహుల్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 77, దేవ్‌దత్‌ (బ్యాటింగ్‌) 131, గిల్‌ (సి) ఉడర (బి) ప్రభాత్‌ 16, పంత్‌ (బ్యాటింగ్‌) 27; ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 73 ఓవర్లలో 288/2. వికెట్ల పతనం: 1-47, 2-236. బౌలింగ్‌: అసిత ఫెర్నాండో 10-1-28-0, లాహిరు కుమార 10-1-51-0, కేశర నువంత 21-0-98-0, ప్రభాత్‌ జయసూర్య 24-4-77-1, ధనంజయ 4-0-15-0, సోనాల్‌ దినుష 4-0-17-0.

2024 తర్వాత భారత వన్‌డౌన్‌ బ్యాటర్‌ టెస్టుల్లో శతకం బాదడం ఇదే తొలిసారి. అలాగే స్వాతంత్య్ర దినోత్సవ రోజున ఈ ఫార్మాట్‌లో సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా దేవ్‌దత్‌.

ఇవి కూడా చదవండి..

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..

Updated Date - Aug 16 , 2026 | 06:01 AM