Share News

అబ్బురం.. ఆరంభ వైభవం

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:47 AM

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ క్రీడలకు సన్నాహ కంగా భావించే ఆసియా క్రీడలకు తెర లేచింది. ఈ క్రీడల ప్రారంభోత్సవాన్ని ఆతిథ్య జపాన్‌ శనివారం ఘనంగా నిర్వహించింది....

అబ్బురం..  ఆరంభ వైభవం

అట్టహాసంగా ఆసియా క్రీడల ప్రారంభోత్సవం

నేటి నుంచి అధికారికంగా పోటీలు

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ క్రీడలకు సన్నాహ కంగా భావించే ఆసియా క్రీడలకు తెర లేచింది. ఈ క్రీడల ప్రారంభోత్సవాన్ని ఆతిథ్య జపాన్‌ శనివారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో అద్భుత నృత్యాలతో కళా సాంస్కృతిక వైభవాలను కళ్లకు కట్టినట్టు చూపడంతో పాటు, తమ సాంకేతికత, పారిశ్రామిక పురోగతిని ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేసింది. ఇక, నేటి నుంచి పక్షం రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంరంభంలో అథ్లెట్లు తమదైన పోరాటాలతో పతకాలు కొల్లగొట్టడం, అభిమానులను రంజింపజేయడమే తరువాయి.

నగోయ: ప్రతీ నాలుగేళ్లకోసారి ప్రపంచ క్రీడాభిమానులను పలకరించే ఆసియా గేమ్స్‌ శనివారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. రెండు గంటలపాటు జరిగిన ఈ వేడుకలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జపాన్‌ ఆతిథ్యమిస్తున్న ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 11 వేల మంది అథ్లెట్లు బరిలోకి దిగబోతున్నారు. వీరి మధ్య 43 క్రీడాంశాల్లో పోటీ జరుగనుంది. అక్టోబరు 4 వరకు జరిగే ఈ గేమ్స్‌లో 469 స్వర్ణ పతకాలను బహూకరించనున్నారు. అయితే ఇప్పటికే బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలు కూడా ఆరంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ‘హార్మోనిక్‌ హార్ట్‌ బీట్‌’ అనే ఇతివృత్తంతో జపాన్‌ తమ క్రీడా చరిత్రలో మూడోసారి ఆసియా క్రీడాకారులకు స్వాగతం పలికింది. 1958, 1994లోనూ జపాన్‌లో ఈ గేమ్స్‌ జరిగాయి. 30 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన మిజుహో పార్క్‌ అథ్లెటిక్‌ స్టేడియంలో.. హృదయం ఆకారంలో ఏర్పాటు చేసిన వేదిక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ అద్భుత వేడుకల్లో స్థానిక ఐచి పారిశ్రామిక సాంకేతికను శాస్త్రీయ కళతో మేళవిస్తూ కళాకారులు చేసిన నృత్య రూపకం వహ్వా అనిపించింది. అలాగే జెండాను ఊపుతున్న భారీ రోబోట్‌ చేయిని కూడా ప్రదర్శించారు. వేడుకల మధ్యలోనే జపాన్‌ చక్రవర్తి నరుహిటో 20వ ఆసియా క్రీడలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. సంగీత దర్శకుడు టారో హకసే, స్థానిక మ్యూజిక్‌ బాండ్‌ ఐఎన్‌ఐ తమ సంగీత, ఆట పాటలతో హోరెత్తించారు. జపాన్‌ మాజీ స్విమ్మర్‌ కొసుకే కిటజిమా ఆసియాగేమ్స్‌ టార్చిని స్టేడియంలోకి తీసుకొచ్చాడు.


తజిందర్‌ స్థానంలో పవన్‌ సెహ్రావత్‌..

ఆసియా క్రీడల ఆరంభ వేడుకల్లో భారత జాతీయ పతాకధారులుగా షూటర్‌ మను భాకర్‌తో పాటు కబడ్డీ ప్లేయర్‌ పవన్‌ సెహ్రావత్‌ వ్యవహరించారు. షెడ్యూల్‌ ప్రకారం భాకర్‌తో షాట్‌ పుటర్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ పాల్గొనాల్సి ఉంది. కానీ ఆరంభ వేడుకల అధికారిక జెర్సీ అతడికి సమయానికి అందకపోవడంతో చివరి నిమిషంలో మార్పు జరిగింది. మరోవైపు భారత పురుష అథ్లెట్లు ముదురు నీలం రంగు బంద్‌గాలా జాకెట్లు, మహిళా అథ్లెట్లు అదే రంగు చీరలను ధరించి మార్చ్‌పా్‌స్టలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:47 AM