Share News

రక్షాబంధన్‌ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

ABN , Publish Date - Aug 28 , 2026 | 02:40 PM

రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. అయితే అసలు ఈ పండుగ ఎలా ప్రారంభమైంది? రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి? రక్షాబంధన్‌ చరిత్ర, విశిష్టత గురించి తెలుసుకుందాం..

రక్షాబంధన్‌ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు
Raksha Bandhan History

ఇంటర్నెట్ డెస్క్: రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమను గుర్తుచేసుకునే పండుగ మాత్రమే కాదు.. రక్షణ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీకగా భావించే ప్రత్యేకమైన రోజు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ‘రక్ష’ అంటే రక్షణ, ‘బంధన్’ అంటే బంధం అని అర్థం. అందుకే రాఖీని రక్షణకు ప్రతీకగా భావిస్తారు.


రక్షాబంధన్‌ ఎలా మొదలైంది?

రక్షాబంధన్‌ పుట్టుకకు సంబంధించి అనేక కథనాలు ఉన్నాయి. హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో రక్షా సూత్రం గురించి పలు కథనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంద్రుడు–ఇంద్రాణి, శ్రీకృష్ణుడు–ద్రౌపది, లక్ష్మీదేవి–బలి చక్రవర్తి కథలు రాఖీ సంప్రదాయంతో ముడిపడి ఉన్నాయి.

Untitled-5.jpg

ఇంద్రుడికి ఇంద్రాణి రాఖీ కట్టిన కథ

రక్షాబంధన్‌కు సంబంధించిన ప్రాచీన పురాణ కథల్లో ఇంద్రుడు–ఇంద్రాణి కథ ఒకటి. భవిష్య పురాణంలో దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం గురించి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. దేవతలు, రాక్షసుల మధ్య సుదీర్ఘంగా యుద్ధం జరిగింది. ఒక దశలో ఇంద్రుడు, దేవతలు ఓడిపోయారు. తిరిగి యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో ఇంద్రాణి పవిత్రమైన రక్షా సూత్రాన్ని ఇంద్రుడి చేతికి కట్టినట్లు కథనం ఉంది. ఆ రక్షా సూత్రం అతడికి రక్షణ, ధైర్యాన్ని అందించిందని, అనంతరం ఇంద్రుడు విజయం సాధించాడని పురాణాల్లో పేర్కొంటారు.


శ్రీకృష్ణుడు–ద్రౌపది కథ

రక్షాబంధన్‌తో ఎక్కువగా అనుసంధానించే మరో కథ మహాభారతానికి సంబంధించినది. కథనం ప్రకారం.. ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయం కావడంతో రక్తం వచ్చింది. అది చూసిన ద్రౌపది తన చీరలోని ఒక చిన్న ముక్కను చించి కృష్ణుడి వేలికి కట్టింది. ద్రౌపది చూపిన ఆప్యాయతకు కృష్ణుడు ఎంతో స్పందించి, ఆమెను ఎప్పటికీ రక్షిస్తానని మాట ఇచ్చినట్లు ప్రాచుర్యంలో ఉన్న కథనం చెబుతుంది. తరువాత కౌరవ సభలో ద్రౌపదికి అవమానం ఎదురైనప్పుడు కృష్ణుడు ఆమెను రక్షించాడని మన పెద్దలు కూడా చెబుతుంటారు.

Untitled-6.jpg

లక్ష్మీదేవి–బలి చక్రవర్తి కథ

మరో ప్రసిద్ధ పురాణ కథనం ప్రకారం.. విష్ణుమూర్తి బలి చక్రవర్తికి ఇచ్చిన మాట కారణంగా సుతల లోకంలో ఉండాల్సి వచ్చింది. దీంతో లక్ష్మీదేవి ఆందోళన చెందింది. శ్రావణ పౌర్ణమి రోజున బలి చక్రవర్తిని సోదరుడిగా భావించిన లక్ష్మీదేవి.. ఆయన చేతికి రక్షా సూత్రం కట్టిందని పురాణ కథనం చెబుతోంది. అనంతరం బలి చక్రవర్తి ఆమెను ఏదైనా వరం కోరుకోవాలని అడగగా.. తన భర్త విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపించాలని లక్ష్మీదేవి కోరింది. ఆమె కోరికను మన్నించిన బలి చక్రవర్తి.. విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లేందుకు అనుమతించాడని కథనం.

రాఖీ అంటే కేవలం అన్నయ్యకు కట్టే దారం కాదు!

రాఖీ సంప్రదాయం నేటి రోజుల్లో కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధానికే పరిమితం కాలేదు. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, పరస్పర రక్షణకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి.. వారి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కోసం ఆకాంక్షిస్తారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు ఎప్పుడూ అండగా ఉంటామని మాటిస్తూ.. వారికి బహుమతులు అందజేస్తారు.

రక్తసంబంధం లేకపోయినా.. ఆత్మీయత, స్నేహం, గౌరవంతో ఏర్పడిన బంధాలకు కూడా రాఖీ కట్టే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అందుకే రక్షాబంధన్‌ కేవలం ఒక పండుగగా కాకుండా.. ఒకరినొకరు గౌరవించుకోవడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం, బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి గుర్తుగా మారింది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 28 , 2026 | 02:50 PM