ముంబై రైలా మజాకా.. కొరియా వ్యక్తికి చుక్కలు కనిపించాయిగా..
ABN , Publish Date - Aug 14 , 2026 | 10:38 AM
దక్షిణ కొరియాకు చెందిన ట్రావెలర్.. ముంబై లోకల్ రైలు ఎక్కే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. థానే స్టేషన్లో రెండుసార్లు యత్నించినా రైలు ఎక్కడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ముంబైకర్ల ధైర్యాన్ని మెచ్చుకుంటూ అతను షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైలు ఎక్కే ప్రయత్నం చేసిన కొరియా వ్యక్తికి చుక్కలు కనిపించాయి. భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ 'సెజిన్'కు ముంబై లోకల్ రైలులో షాకింగ్ అనుభవం ఎదురైంది. థానే రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించేందుకు రూ.170 చెల్లించి రౌండ్-ట్రిప్ టికెట్ తీసుకున్న సెజిన్.. ప్లాట్ఫామ్పైకి చేరుకోగానే అక్కడి జనసందోహాన్ని చూసి గందరగోళానికి గురయ్యాడు. రైలు రాగానే ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. ఇలా రెండుసార్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ప్రయాణికుల రద్దీని తట్టుకోలేక విఫలమయ్యాడు. దీంతో లోకల్ రైలులో ప్రయాణించాలనే తన ఆలోచనను విరమించుకుని, చివరికి టాక్సీని ఆశ్రయించాల్సి వచ్చింది.
ఈ వీడియో @sejinandworld అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో ‘ముంబై రైలులో నా వైఫల్యం’ అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘రద్దీ సమయాల్లో ముంబై మెట్రోలో ప్రయాణించకూడదు. ప్రతి ఒక్కరూ సమయానికి తమ ఆఫీసుకు చేరుకోవడానికి తొందరపడుతుంటారు’ అని, ‘మీరు చాలా త్వరగా భయపడ్డారు! రైలులో గానీ, ప్లాట్ఫారమ్పై గానీ అస్సలు జనం లేరు’ అని ఒకరు కామెంట్ చేశారు.