రైలు పట్టాల మీద మహిళపై దాడి.. అందరూ చూస్తుండగానే..
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:36 PM
రైల్వే పట్టాలపై ఓ జంట ఘర్షణకు దిగిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. మహిళను రైల్వే పట్టాలపై పడేసిన ఓ వ్యక్తి ఆమెపై తీవ్రంగా దాడి చేయడం కలకలం రేపింది.
ముంబై: రైల్వే పట్టాలపై ఓ జంట ఘర్షణకు దిగిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. మహిళను రైల్వే పట్టాలపై పడేసిన ఓ వ్యక్తి ఆమెపై తీవ్రంగా దాడి చేయడం కలకలం రేపింది. ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులు కురిపిస్తూ మహిళను తీవ్రంగా హింసించాడు. స్థానికులెవరూ కలుగజేసుకోకపోవడంతో మరింతగా విజృంభించాడు. ఈ ఘటన ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియో ప్రకారం.. రైల్వే స్టేషన్ ప్రాంతంలో వర్షం పడుతుండగా ఓ మహిళ, మరో వ్యక్తి రైలు పట్టాలపై ఉన్నారు. వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లు కనిపిస్తోంది. మహిళను రైలు పట్టాల పక్కకు లాగి పడేసిన అతడు ఆమెపై దాడి చేయడం ప్రారంభించాడు. మహిళ కింద కూర్చొని ఉండగా తలపై విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా పదేపదే దాడి చేశాడు. అనంతరం పైకి లేపి ప్లాట్ఫామ్ పక్కకు నెట్టాడు. తీవ్ర ఉద్రేకంతో ఆమె హుడీ పట్టుకుని పలుమార్లు కుదిపేశాడు. దీంతో మహిళ ఏడుస్తూ ప్లాట్ఫామ్ పక్కన కూలబడిపోయింది. అనంతరం ఆమె పైకి లేచి ఏడుస్తూ కనిపించింది. ఇంత జరిగినా బాధితురాలు మాత్రం అతనిపై తిరిగి దాడి చేయలేదు. అక్కడున్న వారి సహాయం కూడా అడగలేదు. కాగా, ఆ వీడియోలో వారిద్దరూ ప్లాట్ఫామ్పైకి ఎక్కినట్లు ఎక్కడా కనిపించలేదు.
మరోవైపు, ఇంత జరుగుతున్నా అక్కడున్న ప్రయాణికులు ఎవరూ కలుగజేసుకోలేదు. వర్షంలో గొడుగులు పట్టుకుని అలా నిల్చుండిపోయారే తప్ప, దాడిని ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా వీడియోలు తీస్తూ అలాగే ఉండిపోయారు. అయితే, ఘర్షణకు దిగిన వారు ఎవరు? ఇద్దరికీ ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ముంబై పోలీసులు స్పందించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) ముంబైని ట్యాగ్ చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై జీఆర్పీ పోలీసులు ఇంకా స్పందించలేదు. కాగా, ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
భారత్లో ఫోన్ భద్రతపై విదేశీయురాలి వ్యాఖ్యలు.. వీడియో వైరల్
వరద నీటిలో చిక్కుకున్న కుక్క.. చివరకు ఏమైందంటే..