ఇదే చివరి జర్నీ అంటూ లైవ్ స్ట్రీమింగ్.. ఐసీయూలో యూట్యూబర్
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:17 PM
ఇదే తన చివరి ప్రయాణం అని లైవ్ స్ట్రీమ్ చేసిన ఒక యూట్యూబర్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన మేనేజర్ చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇదే చివరి ప్రయాణం అంటూ తన కారు జర్నీని లైవ్ స్ట్రీమ్ చేసిన యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అనురాగ్ దోభాల్ యాక్సిడెంట్ బారిన పడ్డ విషయం తెలిసిందే. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారు రోడ్ డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కావాలనే ఆయన తన కారును డివైడర్కు ఢీకొట్టినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ అనురాగ్ ప్రస్తుతం ఒక ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు ఆయన మేనేజర్ తెలిపారు.
ఘాజియాబాద్లోని మసూరీ ప్రాంతం వద్ద ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు స్పీడోమీటర్లో కనిపించింది. ప్రమాద సమయంలో ఈ లైవ్ స్ట్రీమ్ను సుమారు 80 వేల మంది వీక్షించారట. ఈ వీడియోలో అనురాగ్ ఆందోళనతో కనిపించారు. తన జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ ఉదంతంపై అనురాగ్ మేనేజర్ తాజాగా స్పందించారు. అనురాగ్ విషయంలో ఎలాంటి ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దని కోరారు. తదుపరి వివరాలను అనురాగ్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే వెల్లడిస్తామని తెలిపారు. ఇక ఈ ఘటనకు ముందు అనురాగ్ తన మనసులోని కల్లోలానికి అద్దం పట్టే పలు పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబంలో గొడవలు ఉన్నాయని, మానసిక వేదనను అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చారు. కుటుంబసభ్యులపై పలు ఆరోపణలు చేశారు. అనురాగ్ సోదరుడు ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అవన్నీ ఏకపక్షమని తేల్చి చెప్పారు.
ఈ వార్తలూ రాయండి:
ఇదే తన చివరి జర్నీ అంటూ యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్! చివరకు..
చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో