దుబాయ్లో అత్యున్నత భారతీయ అధికారిగా విష్ణువర్ధన్ రెడ్డి
ABN , Publish Date - Jul 27 , 2026 | 07:32 PM
ప్రపంచంలో అత్యంత కీలకమైనదిగా భావించే దుబాయ్లోని భారతీయ కాన్సులేటులో అత్యున్నత అధికారిగా తెలుగు దౌత్యవేత్త నియామకం దాదాపు ఖరారైంది. దుబాయ్ అర్ధ శతాబ్ది చరిత్రలో ప్రపథమంగా ఒక తెలుగు అధికారి రానున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ప్రపంచంలో అత్యంత కీలకమైనదిగా భావించే దుబాయ్లోని భారతీయ కాన్సులేటులో అత్యున్నత అధికారిగా తెలుగు దౌత్యవేత్త నియామకం దాదాపు ఖరారైంది. దుబాయ్ అర్ధ శతాబ్ది చరిత్రలో ప్రపథమంగా ఒక తెలుగు అధికారి రానున్నారు. భారతీయ కాన్సుల్ జనరల్గా 2008 బ్యాచ్కు చెందిన ఐ.యఫ్.యస్ అధికారి డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డిని నియమించనున్నట్లుగా తెలుస్తోంది. న్యూ ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ నుంచి వైద్య విద్య పూర్తి చేసిన ఆయన స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇటీవలి వరకు ఆయన డిప్యూటెషన్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుబడులు, పరిశ్రమల వ్యవహారాలను పర్యవేక్షించారు. ఐరోపా, అమెరికా ఖండాలతో పాటు ఐక్యరాజ్య సమితిలో కూడ పని చేసిన ఆయన గతంలో హైద్రాబాద్లో ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిగా కూడ పని చేశారు.

దాదాపు 40 లక్షల మంది భారతీయులు పని చేసే యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్లో దుబాయ్ కీలకమైంది. అలాగే భారత్కు అతి పెద్ద రెండో ఎగుమతి దేశం కూడా. లాంఛనంగా విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత ఆయనతో కలిపి గల్ఫ్ దేశాలలో ప్రప్రథమంగా ముగ్గురు అధికారులు అత్యున్నత హోదాల్లో ఉంటారు. సౌదీ అరేబియాలోని జెద్ధాలో ఫహాద్ ఖాన్ సూరి (కర్నూలు) ఖతర్ లో కొప్పుల శ్రీకర్ రెడ్డి (నల్గోండ)లు ఉన్నారు. కొద్ది కాలం క్రితం వరకూ ఒమాన్లో జి.వి.శ్రీనివాస్, అంతకు ముందు సౌదీ అరేబియాలో డాక్టర్ ఔసాఫ్ సయీద్లు కూడా రాయబారులుగా పని చేశారు.