Share News

నవోదయ బడుల్ని అడ్డుకోవడమేంటి?

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:30 AM

నవోదయ పాఠశాలల్ని అడ్డుకోవడమేంటని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. తమిళనాడు గడ్డపై హిందీని బోధించకూడదనే వైఖరి ఉండకూడదని, నవోదయ పాఠశాలల ఏర్పాటు రాష్ట్ర విధానానికి విరుద్ధం కాదని వ్యాఖ్యానించింది.

నవోదయ బడుల్ని అడ్డుకోవడమేంటి?
SUPREMECOURT

  • మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి

  • హిందీ బోధన ఉండకూడదంటే ఎలా?

  • తమిళనాడు సర్కార్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు

చెన్నై, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): నవోదయ పాఠశాలల్ని అడ్డుకోవడమేంటని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. తమిళనాడు గడ్డపై హిందీని బోధించకూడదనే వైఖరి ఉండకూడదని, నవోదయ పాఠశాలల ఏర్పాటు రాష్ట్ర విధానానికి విరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. భాషా విధానంపై కేంద్రంతో కూలంకషంగా చర్చించాలని హితవు పలికింది. నవోదయ పాఠశాలల ఏర్పాటు కోసం భూములను గుర్తించడానికి మరో మూడు నెలల పాటు గడువు ఇస్తామని, ఆ లోపు ప్రతి జిల్లాలోనూ భూముల్ని గుర్తించాల్సిందేనని స్పష్టం చేసింది. తమిళనాట ప్రభుత్వం మారినందున, ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘నవోదయ పాఠశాలల ఏర్పాటును వ్యతిరేకించడానికి కారణమేంటి? హిందీని బలవంతంగా రుద్దుతారన్న భావనేనా? నవోదయ పాఠశాలల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కూర్చొని చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సివుంది’ అని ధర్మాసనం సూచించింది. తమిళనాట నవోదయ పాఠశాలల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్‌ పీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది జైదీప్‌ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తమిళనాట తగినన్ని పాఠశాలలు ఉన్నాయని, రాష్ట్రంలో హిందీ నేర్చుకోవడంపై ఎలాంటి నిషేధం లేదని వివరించారు. ప్రతి రాష్ట్రానికి దాని సొంత విద్యా విధానం ఉంటుందని, నవోదయ పాఠశాలలు రాష్ట్ర విద్యా విధానానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.


ఇది ప్రభుత్వ విధానానికి సంబంధించిన సమస్య అని, హిందీని బలవంతంగా రుద్దడమే ఏకైక కారణం కాదని వాదించారు. ఆర్థిక సమస్యలు కూడా వున్నాయని వివరించారు. అందువల్ల నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించరాదని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

ఈ వార్తలు కూడా చదవండి

భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

మల్లారెడ్డి కుటుంబంపై సొంత పార్టీ నేతల ఆగ్రహం.. ప్రీతి రెడ్డి ఫ్లెక్సీలు చించివేత

Updated Date - Sep 18 , 2026 | 01:30 AM