Share News

బీమా సొమ్ము కోసం ‘నంబర్‌’ గేమ్‌!

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:16 AM

దేశవ్యాప్తంగా వాహన ప్రమాద బీమా క్లెయిములలో జరుగుతున్న మోసాలపై విచారణ చేపడుతున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు ప్రత్యేక దర్యాప్తు బృందా (సిట్‌)లను ఏర్పాటు చేసి...

బీమా సొమ్ము కోసం ‘నంబర్‌’ గేమ్‌!

వాహన ప్రమాద బీమా పరిహారాల్లో అక్రమాలు

  • మోసపూరిత క్లెయిములను తేల్చేలా ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశవ్యాప్తంగా వాహన ప్రమాద బీమా క్లెయిములలో జరుగుతున్న మోసాలపై విచారణ చేపడుతున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు ప్రత్యేక దర్యాప్తు బృందా (సిట్‌)లను ఏర్పాటు చేసి.. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఇకపై అనుమానిత బీమా క్లెయిములపై ఆ సిట్‌లతో దర్యాప్తు చేయించాలని స్పష్టం చేసింది. ఒకే వాహనం అనేక ప్రమాదాలకు కారణమైనట్టు చూపిస్తూ, బీమా సొమ్మును పొందుతుండం వ్యవస్థీకృతంగా సాగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయని పేర్కొంది. ఒడిశాలో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించి ఈ తీర్పు వెలువరించింది. 2017 అక్టోబరులో ఒడిశాలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో గాయపడిన తునీపతి, మరికొందరు వ్యక్తులకు ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ బీమా పరిహారం చెల్లించేందుకు నిరాకరించింది. ప్రమాదానికి కారణమైన వాహనంపై సందేహం వ్యక్తం చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వచ్చింది. ప్రమాదం జరిగింది నిజమే అయినా.. పరిహారం పొందడానికి బీమా చెల్లుబాటు ఉన్న మరో వాహనం నంబరును ఉపయోగించారని బీమా సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై గత ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అసలు ఆ వాహనం ఇంతకు ముందు ఏదైనా ప్రమాదాలకు కారణమైందా తేల్చాలని ఒడిశా అధికారులను ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు.. ఈ బీమా క్లెయిమ్‌లో పేర్కొన్న వాహనం నంబరు మరో నాలుగు ప్రమాద కేసుల్లోనూ కనిపించిందంటూ ఒడిశా అధికారులు సుప్రీంకోర్టుకు ఈ ఏడాది మార్చిలో నివేదిక ఇచ్చారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహాలో వ్యవస్థీకృతంగా మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది జగదీశ్‌ చంద్ర సోలంకి ధర్మాసనానికి పలు ప్రతిపాదనలు చేశారు. వివిధ బీమా కంపెనీల క్లెయిములకు సంబంధించిన సమాచారాన్ని ఒకే పోర్టల్‌లో ఉంచితే.. ఒకే వాహనం, ఒకే సంస్థ, ఒకే వ్యక్త పదేపదే బీమా క్లెయిములు చేస్తుంటే గుర్తించవచ్చని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 27 , 2026 | 06:16 AM