వేలానికి దివంగత సీఎం జయలలిత ఇల్లు!
ABN , Publish Date - Feb 06 , 2026 | 07:53 AM
దివంగత సీఎం జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను కట్టాల్సి ఉండటంతో.. ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేయాలని చూస్తున్నారు. జయలలితకు సంబంధించి ఆదాయ, ఆస్తి పన్నులు రూ.13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి..
చెన్నై, ఫిబ్రవరి 6: దివంగత సీఎం జయలలిత నివాసం ‘వేద నిలయం’ను వేలానికి పెట్టే అవకాశం కనిపిస్తోంది. జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను కట్టాల్సి ఉండటంతో.. ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేసేందుకు చూస్తున్నారు. జయలలితకు సంబంధించి ఆదాయ, ఆస్తి పన్నులు రూ.13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. జయలలిత చట్టపరమైన వారసులు ఇప్పటి వరకు రూ.13.69 కోట్లు చెల్లించలేదని తెలుస్తోంది.
చట్టపరమైన వారసులు రూ.13.69 కోట్లు వడ్డీతో సహా చెల్లించకపోతే.. ‘వేద నిలయం’ను వేలానికి పెట్టే అవకాశం ఉందని ఆదాయ పన్ను శాఖ అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. దివంగత సీఎం జయలలిత 1991-92 నుంచి 2006 - 07 మధ్య కాలంలో ఆదాయ పన్ను కట్టలేదని, 1992 -93 నుంచి 2015 -16 మధ్య ఆస్తి పన్ను కట్టలేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు కోర్టుకు వెల్లడించారు. జయలలిత చెల్లించాల్సిన మొత్తం పన్ను వడ్డీతో సహా రికవరీ చేయాల్సి ఉందన్నారు.
కాగా, జయలలిత 2016, డిసెంబర్ 5వ తేదీన అనారోగ్యం కారణంగా చనిపోయారు. మద్రాస్ హైకోర్టు 2020, మే 27వ తేదీన జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్లను చట్టపరమైన వారసులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జయలలిత చెల్లించాల్సిన పన్నును.. వారి నుంచి రికవరీ చేయాలని ఆదాయ పన్ను శాఖ భావించింది. 2025, జులై 13వ తేదీన నోటీసులు పంపింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ దీప 2025, ఆగస్టు 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించింది.
ఇవి కూడా చదవండి..
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..