సువేందు పీఏ హత్యలో ముగ్గురి అరెస్ట్
ABN , Publish Date - May 12 , 2026 | 05:25 AM
పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు...
నిందితులను పట్టించిన యూపీఐ పేమెంట్
కోల్కతా, మే 11: పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కోల్కతా సమీపంలోని ఓ టోల్గేట్ వద్ద నిందితులు చేసిన యూపీఐ పేమెంట్ ఆధారంగా పోలీసులు కూపీ లాగారు. ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి బిహార్, యూపీలో ముగ్గురిని అరెస్ట్ చేసి బెంగాల్లోని బరసత్ కోర్టులో ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన విశాల్ శ్రీవాస్తవ, రాజ్ సింగ్, మయాంక్ మిశ్రా కరడుగట్టిన నేరస్థులని తేలింది. వీరిలో బిహార్ బక్సర్ ప్రాంతానికి చెందిన శ్రీవాస్తవపై హత్య, దొంగతనం కేసులతో పాటు 15 క్రిమినల్ కేసులున్నాయి. దుండగులు ఉపయోగించిన రెండు ద్విచక్రవాహనాలు, ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్ట్ హత్య కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి ఆధారాల కోసం యూపీ, బిహార్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 6న రాత్రి పదిన్నర గంటలకు సువేందు పీఏ చంద్రనాథ్ ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బైక్లపై వెంబడించారు. అతి సమీపం నుంచి కారు అద్దాల్లోకి 4రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్