Share News

యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి

ABN , Publish Date - May 31 , 2026 | 03:35 PM

యూపీలో కలకలం రేపిన టీనేజర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శనివారం రాత్రి పోలీస్ ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు.

యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి
UP Murder Case Accused Asad

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో కలకలం రేపిన టీనేజర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అసద్ శనివారం రాత్రి పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. బక్రీద్ నాడు సూర్య చౌహాన్ అనే టీనేజర్‌ను అసద్, మరికొందరితో కలిసి హత్య చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో యూపీలో పెను కలకలం రేగింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇక అసద్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఘాజియాబాద్ పోలీసులకు అతడు తన స్నేహితుడిని కలిసేందుకు ఖోదా ప్రాంతానికి వస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో, పోలీసులు నిఘా పెట్టారు. మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వచ్చిన అతడు పోలీసులపై కాల్పులకు దిగాడు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగడంతో అసద్‌కు గాయాలయ్యాయి. ఒక కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడని పోలీసులు తాజాగా తెలిపారు.


మే 28న సూర్య చౌహాన్‌.. అసద్‌తో పాటు మరికొందరితో వాగ్వావాదానికి దిగాడు. బైక్ విషయంలో వారి మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో సూర్య వారి చేతిలో హత్యకు గురయ్యాడు. దీంతో, అతడి కుటుంబసభ్యులు స్థానికంగా నిరసనకు దిగారు. నిందితుల ఎన్‌కౌంటర్ జరిగాకే తన కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేస్తానని మృతుడి తల్లి తేల్చి చెప్పారు. అయితే, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు నచ్చచెప్పడంతో సూర్య కుటుంబం చివరకు అతడి అంత్యక్రియలను పూర్తి చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం ఐదు మందిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అసద్ మాత్రం ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు.


ఈ వార్తలనూ చదవండి:

మంత్రులు, డిప్యూటీ సీఎంలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. మల్లికార్జున్ ఖర్గే

హిమాచల్‌ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా

Updated Date - May 31 , 2026 | 03:46 PM