దొంగ పోలీసు..ట్రక్కు డ్రైవర్ని లిఫ్ట్ అడిగి.. చివరకు ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:15 AM
ఆయనో పోలీసు అధికారి. పేరు గిరీశ్ మిశ్రా. సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో కోర్టు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారు. మంగళవారం విధుల్లో....
ట్రక్కు డ్రైవర్ని లిఫ్ట్ అడిగి అందులో ఉన్న రూ.20వేలు తీసుకొని జంప్
13 కి.మీ. వెంబడించి పట్టుకున్న డ్రైవర్
కోపంతో దొంగ ఎస్సై చెంపలు వాయించిన మనీశ్.. వీడియో వైరల్
యూపీలోని హమీర్పూర్లో ఘటన
న్యూఢిల్లీ, జూలై 7: ఆయనో పోలీసు అధికారి. పేరు గిరీశ్ మిశ్రా. సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో కోర్టు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారు. మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో ఓ ట్రక్కు డ్రైవర్ను లిఫ్ట్ అడిగారు. డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్నారు. కొంతదూరం వెళ్లాక క్యాబిన్లో రూ.20వేల డబ్బును గమనించిన ఆ ఎస్సై దాన్ని గుట్టుగా యూనిఫాంలో దాచేసుకున్నారు. తర్వాత ఓ టోల్ప్లాజా దగ్గర దిగి వేరే వాహనంలో వెళ్లిపోయారు. అయితే, క్యాబిన్లో డబ్బు పోయిన విషయాన్ని వెంటనే గుర్తించిన ట్రక్కు డ్రైవర్ మనీశ్.. ఎస్సై వెళ్లిన వాహనాన్ని వెంబడించాడు. 13కిలోమీటర్లు చేజ్ చేసి ఎస్సైని పట్టుకున్నాడు. గల్లా పట్టుకొని నిలదీయగా ఎస్సై యూనిఫాంలో ఉన్న డబ్బు దొరికింది. దీంతో, కోపోద్రిక్తుడైన ట్రక్కు డ్రైవర్ ఎస్సై చెంపలు వాయించాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఘటనపై స్పందించిన హమీర్పూర్ ఎస్పీ గిరీశ్ను సస్పెండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు.
మధ్యప్రదేశ్లో వక్ఫ్బోర్డులో హిందువులకు చోటు
భోపాల్, జూలై 7: మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ సభ్యులను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం మోహన్రాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం.. వక్ఫ్(సవరణ)-2025 నిబంధనల ప్రకారం బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వం ఉన్న వక్ఫ్ చట్టం-1995 ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లింలే సభ్యులుగా ఉండేందుకు అర్హత కలిగి ఉండేవారు. 2025 నాటి సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్ర వక్ఫ్ బోర్డులోను ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చాలనే నిబంధనను చేర్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టం కింద బోర్డును పునర్వ్యవస్థీకరించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. కొత్తగా ఏర్పడిన 10 మంది సభ్యుల బోర్డులో ఇండోర్కు చెందిన మనోజ్ మల్పానీ, గుణా జిల్లాకు చెందిన అనిమేష్ భార్గవలను ముస్లిమేతర సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్