Share News

కార్మికుల నిరసనలు.. వేతనాన్ని పెంచిన యూపీ ప్రభుత్వం

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:43 PM

యూపీలో కార్మికుల నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

కార్మికుల నిరసనలు..  వేతనాన్ని పెంచిన యూపీ ప్రభుత్వం
UP minimum wages hike

ఇంటర్నెట్ డెస్క్: వేతన పెంపు కోసం కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీల కార్మికుల కనీస వేతనాలను రూ.3 వేల వరకూ పెంచుతున్నట్టు ప్రకటించింది. వేతన పెంపు కోసం నోయిడా, ఘాజియాబాద్‌‌లో కార్మికులు నిన్న చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ప్రకటన ప్రకారం, గౌతమ్‌బుద్ధ నగర్, ఘాజియాబాద్‌లోని నైపుణ్యాలు లేని (అన్‌స్కిల్డ్) కార్మికుల నెలవారీ వేతనాలు రూ.11,313 నుంచి రూ.13,690కి పెరిగాయి. సెమీ స్కిల్డ్ వర్కర్ల కనీసం వేతనం రూ.15,059, స్కిల్డ్ వర్కర్ వేతనం రూ.16,306కు పెరిగింది. ఏప్రిల్ 1 నుంచే వీటిని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో అన్‌స్కిల్డ్ వర్కర్లు నెలవారీ వేతం రూ.13,006గా, సెమీ స్కిల్డ్ వర్కర్ల వేతం రూ.14,306గా, స్కిల్డ్ వర్కర్‌ నెలవారీ వేతనం రూ.16,025గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర జిల్లాల్లో అన్‌స్కిల్డ్ వర్కర్ల కనీస వేతనం రూ.12,356, సెమీస్కిల్డ్ వర్కర్ల వేతనం రూ.13,591, స్కిల్డ్ వర్కర్ల వేతనం రూ.15,224గా ప్రకటించింది.


ఇది మధ్యంతర నిర్ణయమని, త్వరలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని కూడా అధికారులు పేర్కొన్నారు. కార్మిక సంస్థలు, కంపెనీ యాజమాన్యాల సంఘాలతో చర్చల అనంతరం ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇక నోయిడాతో పాటు ఇతర ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో నిన్న నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. రాళ్లు రువ్వడం, ఆస్తులను ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు 350 మంది అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరింత మందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

నోయిడా అల్లర్లకు పాకిస్థాన్‌తో సంబంధాలు: మంత్రి సంచలన కామెంట్లు..

దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

Updated Date - Apr 14 , 2026 | 01:24 PM