ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి తల నరికి.. ఇంటికి తీసుకెళ్లి..
ABN , Publish Date - Mar 29 , 2026 | 07:40 AM
ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ అమ్మే యువకుడి తల నరికి ఇంటికి తీసుకెళ్లాడు. తలను ఇంట్లో ఓ మూల పడేసి.. వంట చేయటం మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు భారీ బలగాలతో వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.
లక్నో, మార్చి 29: ఉత్తర ప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ అమ్మే యువకుడి తల నరికి ఇంటికి తీసుకెళ్లాడు. తలను ఇంట్లో ఓ మూల పడేసి.. వంట చేయటం మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు భారీ బలగాలతో వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బరబంకీ జిల్లాకు చెందిన బబ్లూ అనే 25 ఏళ్ల ఓ యువకుడు ఐస్ క్రీమ్ అమ్మి జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా, బబ్లూ ఐస్ క్రీమ్లు అమ్మడానికి పర్సావల్ గ్రామం వెళ్లాడు.
అక్కడ శంకర్ యాదవ్ అనే వ్యక్తితో బబ్లూకు గొడవైంది. గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ నేపథ్యంలోనే శంకర్ యాదవ్ వేట కొడవలితో బబ్లూ తల నరికేశాడు. గ్రామస్థులు చూస్తుండగానే.. తలను మొండెం నుంచి వేరు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తలను ఓ మూలకు పడేసి వంట వండటం మొదలెట్టాడు. మర్డర్ గురించిన సమాచారం జిల్లా ఎస్పీకి అందింది. భారీ బలగాలతో వెళ్లి నిందితుడిని పట్టుకోవాలని ఆయన స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పెద్ద సంఖ్యలో శంకర్ యాదవ్ ఇంటిని చుట్టుముట్టారు.
పోలీసులు ఇంట్లోకి వెళ్లే సమయానికి బబ్లూ తల ఓ మూలకు పడిఉంది. శంకర్ యాదవ్ అసలేమీ జరగనట్లు వంట చేస్తూ ఉన్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని సీజ్ చేశారు. బబ్లూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడు బబ్లూకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు తమ్ముళ్లను తన సంపాదనతోటే పోషిస్తున్నాడు. బబ్లూ హత్యతో కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి
ఆందోళనక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంది