ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖలీద్కు మధ్యంతర బెయిల్
ABN , Publish Date - May 22 , 2026 | 01:52 PM
ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు ఢిల్లీ హైకోర్టు మూడు రోజుల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూర్ చేసింది. బెయిల్ విషయంలో అతడికి గతంలో ట్రయల్ కోర్టులో చుక్కెదురు కాగా హైకోర్టులో తాజాగా ఊరట దక్కింది. జూన్ 1-3 తేదీల మధ్య మూడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
సీఏఏకు వ్యతిరేకంగా 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఖలీద్పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ ఏడాది సెప్టెంబర్లో అరెస్టైన అతడు నాటి నుంచీ జైల్లో ఉంటున్నాడు. తల్లి సర్జరీ ఉన్నందున ఆమెను చూసుకునేందుకు 15 రోజుల పాటు బెయిల్ కోరుతూ ఖలీద్ దాఖలు చేసిన పిటిషన్ను గతంలో ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు మాత్రం ఖలీద్కు స్వల్ప ఊరట కల్పిస్తూ మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా కోర్టు ఉమర్ ఖలీద్కు పలు షరతులు విధించింది. బెయిల్పై విడుదలయ్యాక ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధి దాటి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అధికారులకు ఇచ్చిన అడ్రస్లోనే ఉండాలని చెప్పింది. ఆసుపత్రి మినహా మరే ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. బెయిల్ సమయంలో ఒకే ఒక మొబైల్ నెంబర్ను వాడాలని కూడా స్పష్టం చేసింది. ఢిల్లీ పోలీసులు మాత్రం ఉమర్ ఖలీద్కు బెయిల్ను వ్యతిరేకించారు. అతడి తల్లిది సాధారణ శస్త్రచికిత్స అని పేర్కొన్నారు. పోలీసు భద్రత మధ్య తల్లిని చూసేందుకు ఖలీద్కు అనుమతిస్తే సరిపోతుందని చెప్పారు. అయితే, కోర్టు చివరకు అతడికి మూడు రోజుల బెయిల్ను మంజూరు చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
సీబీఎస్ఈ 'త్రిభాషా' విధానంపై సుప్రీంకోర్టులో పిటిషన్..!
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు