ట్విష శర్మ ఆత్మహత్య.. వెలుగులోకి చివరి మెసేజ్లు..
ABN , Publish Date - May 18 , 2026 | 12:51 PM
ట్విష శర్మ సూసైడ్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ట్విష శర్మ సూసైడ్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్విష శర్మ ఆత్మహత్య చేసుకోవడాని కొన్ని రోజుల ముందు తన స్నేహితులతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసింది. తన ఆవేదనను వారితో పంచుకుంది. ‘నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. విపరీతమైన యాంగ్జైటీతో బాధపడుతున్నాను. జీవితంలో ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. పెళ్లితో కుటుంబం ఏర్పడుతుంది. కానీ, పెళ్లి తర్వాత మన మీద మనం శ్రద్ధ పెట్టడం మానుకోవద్దు’..
‘పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవద్దు. బాగా ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్లు. ఇంతకంటే ఏమీ చెప్పలేను’ అంటూ మే 7వ తేదీన ట్విష ఓ స్నేహితురాలితో వాట్సాప్లో చాట్ చేసింది. మే 9వ తేదీన ట్విష ఇన్స్టాగ్రామ్లో మరో స్నేహితురాలితో చాట్ చేసింది. ‘నేను ట్రాప్లో చిక్కుకున్నా. నువ్వు చిక్కుకోకుండా చూసుకో. నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేను. సరైన సమయం దొరికినపుడు నీకు ఫోన్ చేస్తా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ట్విష తన స్నేహితులతో చేసిన చాటింగ్స్ తాలూకా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని నోయిడాకు చెందిన ట్విష శర్మకు 2024లో డేటింగ్ యాప్ ద్వారా మధ్య ప్రదేశ్లోని భోపాల్కు చెందిన సమర్థ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి 2025 డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ట్విష ఢిల్లీలోని ఓ కంపెనీలో పని చేసేది. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసింది. మే 12వ తేదీన కటారా హిల్స్లోని సమర్థ్ ఇంట్లో ట్విష ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ట్విష మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్య అని అంటున్నారు. మరో సారి పోస్టు మార్టం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్లో ట్రంప్ కలకలం .. 90 రోజుల్లో 3,700 లావాదేవీలు
జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన