ప్రాంక్ వీడియోల కోసం ఈ-రిక్షాల 'రిమోట్ షట్డౌన్' కలకలం.. 2 యాప్స్ డిలీట్!
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:55 PM
సోషల్ మీడియాలో 'ప్రాంక్ వీడియోల' పేరుతో ఆకతాయిలు ఈ-రిక్షా డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తూ, ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్న రెండు వివాదాస్పద చైనీస్ బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్స్పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టి, వాటిని డిలీట్ చేయించింది.
ఢిల్లీ, జూలై 3: సోషల్ మీడియాలో 'ప్రాంక్ వీడియోల' కోసం కొందరు ఆకతాయిలు చేస్తున్న విపరీత చేష్టలకు ఫుల్ స్టాప్ పడింది. కొన్ని రోజులుగా ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో ఈ-రిక్షా డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తూ, ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేయడానికి కారణమవుతున్న 2 వివాదాస్పద చైనీస్ బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్స్పై కేంద్రం నిఘా పెట్టి, వాటిని డిలీట్ చేయించింది. 'BAT-BMS', 'Epoch Li-ion' అనే ఈ రెండు యాప్లను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి పూర్తిగా తొలగించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) సెక్రటరీ ఎస్. కృష్ణన్ ఇవాళ వెల్లడించారు.
అసలు ఈ 'బ్లూటూత్ ప్రాంక్' వ్యవహారం ఏంటి?
చైనాకు చెందిన 'షెన్జెన్ గ్రీనర్జీ టెక్నాలజీ' అభివృద్ధి చేసిన 'BAT-BMS' యాప్ నిజానికి లిథియం-అయాన్ బ్యాటరీల వోల్టేజ్, ఉష్ణోగ్రత, ఛార్జింగ్ సైకిల్స్, బ్యాటరీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రూపొందించిన ఒక సాధారణ యాప్. ఈ యాప్లో బ్యాటరీ పవర్ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే 'డిశ్చార్జ్ కంట్రోల్' ఫీచర్ కూడా ఉంది.
భద్రతా లోపం: భారతదేశంలో నడిచే చాలా బడ్జెట్ ఈ-రిక్షాలు, ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో చైనా తయారీ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (BMS) వాడుతున్నారు. అయితే, ఈ సిస్టమ్స్కు ఎలాంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉండదు. కంపెనీ ఇచ్చిన సాధారణ పాస్వర్డ్లతోనే ఇవి పనిచేస్తాయి.
దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఒక ట్రెండ్ మొదలుపెట్టారు. రోడ్డుపై ఈ-రిక్షా వెళ్తున్నప్పుడు.. దానికి 10 నుంచి 15 మీటర్ల బ్లూటూత్ పరిధిలో నిలబడి, ఈ యాప్ల ద్వారా సదరు రిక్షా బ్యాటరీకి కనెక్ట్ అవుతున్నారు. రిక్షా కదులుతుండగానే అకస్మాత్తుగా పవర్ కట్ (Remote shutdown) చేసి వాహనాన్ని నిలిపివేస్తున్నారు.
దీనివల్ల కదులుతున్న వాహనాలు అకస్మాత్తుగా ఆగిపోయి వెనుక వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఏర్పడటమే కాకుండా, రోజువారీ కూలీలైన ఈ-రిక్షా డ్రైవర్లు నడిరోడ్డుపై గంటల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర మంత్రికి లేఖ.. వెలుగులోకి తెచ్చిన బీజేపీ నేత
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ-రిక్షా డ్రైవర్లను ముప్పుతిప్పలు పెడుతున్న ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల నుంచి కూడా ఒత్తిడి వ్యక్తమైంది. కదులుతున్న వాహనాలను ఆకతాయిలు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా యాప్స్ ఓపెన్ చేసి రిమోట్గా ఆఫ్ చేస్తూ, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంపై బీజేపీ నేత తజిందర్ బగ్గా స్పందించారు.
ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రమాదంలో పడేస్తున్న ఈ చైనీస్ బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్స్ను తక్షణమే నిషేధించాలంటూ ఆయన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ప్రత్యేకంగా లేఖ రాశారు. దీనిపై మీటీ (MeitY) ప్రత్యేక విచారణ జరిపి, ఈ రెండు అప్లికేషన్లు దుర్వినియోగం అవుతున్నాయని నిర్ధారించుకుని గూగుల్, యాపిల్ సంస్థల సాయంతో వాటిని ప్లే స్టోర్ల నుండి తక్షణమే తొలగించింది.
ఈ వార్తలు కూడా చదవండి
విజయ్ ప్రభుత్వం కూల్చివేత కుట్ర కేసులో మరో నలుగురి అరెస్టు
ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు