మారుతున్న పులుల స్వభావం.. మనుషులే టార్గెట్గా దాడులు..
ABN , Publish Date - Feb 27 , 2026 | 07:05 AM
ది 2026 స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ (SOE 2026) నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుండి జూన్ మధ్య కాలంలో పులుల రిజర్వ్ ప్రాంతాల సమీపంలో కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశంలో మనుషులపై పులుల దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పులుల స్వభావం మారుతోంది. ముందెన్నడూ లేని విధంగా మనుషులను టార్గెట్ చేస్తున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2024 సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో జరిగిన దాడుల కంటే.. 2025 సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో జరిగిన దాడుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక, పశువులపై దాడుల విషయానికి వస్తే.. పులులు గ్రామ ఆర్థిక వ్యవస్థలో భాగంగా మారాయి. పులుల దాడులలో చనిపోయిన ఆవులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరిహారం చెల్లిస్తోంది.
సాధారణంగా పులులు మనుషులను ఆహారంగా తీసుకోవు. వయసు మళ్లినపుడు లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు మాత్రమే మనుషులపై దాడులు చేస్తాయి. కానీ, 2025లో పులులు తమ స్వభావానికి భిన్నంగా 4 సందర్భాల్లో మనుషులను తిన్నట్లు నివేదిక పేర్కొంది. ది 2026 స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ (SOE 2026) నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుండి జూన్ మధ్య కాలంలో పులుల రిజర్వ్ ప్రాంతాల సమీపంలో కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఇదే కాలంలో 44 మంది మరణించారు.
మనుషులపై పులుల దాడులు పెరగడానికి ప్రధాన కారణం పులుల ఆవాసాలు, మానవ నివాస ప్రాంతాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడమే అని నివేదిక పేర్కొంది. పులులు ఉన్న 20 రాష్ట్రాల్లోని గణాంకాల ప్రకారం.. పులులు సంచరించే సుమారు 40 శాతం ప్రాంతంలో దాదాపు 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. పులుల సంరక్షణ కేంద్రాలు పులుల సంఖ్యతో నిండిపోయాయి. దీనివల్ల ఆహారం కోసం అవి అడవులను దాటి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనుషులపై దాడి చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ముదిరిన సరిహద్దు వివాదం.. అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ భారీ వైమానిక దాడులు
సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్కు కొత్త వెబ్సైట్