సరోగసీ కేంద్రాల నియంత్రణ.. కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jun 04 , 2026 | 07:07 PM
పిల్లల అక్రమ రవాణా నిరోధానికి వీలుగా సరోగసీ, ఐవీఎఫ్లకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు లేమిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ఈ విషయంలో కేంద్రం తన అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల అక్రమ రవాణా నిరోధానికి సంబంధించిన కేసులో విచారణ చేపడుతున్న సుప్రీంకోర్టు.. సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాల నియంత్రణపై దృష్టి సారించింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ అడ్వకేట్ అపర్ణా భట్ చేసిన సూచనలను పరిశీలించింది. మానవ అక్రమ రవాణాను నిరోధించేలా సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు (ఎస్ఓపీ) లేవని ఆమె ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సరోగసీ, ఐవీఎఫ్ క్లినిక్స్ నియంత్రణ కోసం తీసుకొచ్చిన ఏఆర్టీ చట్టంలో అనేక నిబంధనలు ఉన్నప్పటికీ, చిన్నారుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ లేదని అపర్ణా భట్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ప్రధానంగా వైద్య ప్రమాణాలు, మౌలిక వసతులకే పరిమితమయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలో నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీ సూచనలతో సమగ్ర విధానాన్ని రూపొందించాలని ప్రతిపాదించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇండియా కూటమి భేటీకి నై.. డీఎంకే సంచలన నిర్ణయం
అగ్నిప్రమాదం.. భవనం నుంచి బాధితులు దూకుతుంటే.. కింద పరుపులను పేర్చి..