వాంగ్చుక్ నిర్బంధాన్ని సమీక్షించండి.. కేంద్రానికి సుప్రీం సూచన
ABN , Publish Date - Feb 04 , 2026 | 09:43 PM
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుగ్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు బుధవారంనాడు ఆందోళన వ్యక్తం చేసింది. వాంగ్చుక్ నిర్బంధంపై పునఃసమీక్షించాలని కేంద్రానికి సూచించింది.
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుగ్ (Sonam Wangchuk) ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు ఆందోళన వ్యక్తం చేసింది. వాంగ్చుక్ నిర్బంధంపై పునఃసమీక్షించాలని కేంద్రానికి సూచించింది. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆయన హెల్త్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోందని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీబీ వరలేతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
'వాంగ్చుక్ నిర్బంధం ఆదేశాలు జారీ చేసి సుమారు ఐదు మాసాలు అవుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని హెల్త్ రిపోర్ట్ చెబుతోంది. ఇది వయసుకు సంబంధించిన సమస్య కావచ్చు, మరొకటి కావచ్చు. ఆయన నిర్బంధాన్ని కేంద్రం పునఃసమీక్షించే అవకాశం ఉందా?' అని ప్రభుత్వ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనర్ కేఎం నటరాజన్ను ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.
లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగం ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్లతో గత ఏడాది లెహ్లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిందని, దీనికి వాంగ్చుక్ బాధ్యులని నటరాజన్ కోర్టుకు తన వాదన వినిపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలే ఇందుకు కారణమన్నారు. ఒక వ్యక్తి నేరుగా అల్లర్లలో పాల్గొనక్కర లేదని, సమూహాన్ని ప్రభావితం చేసినా సరిపోతుందని, అప్పటి హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 161 మంది గాయపడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. హింసాకాండ జరిగిన రెండు రోజులకు సెప్టెంబర్ 26న వాంగ్చుక్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. కాగా, ఈ అంశంపై కోర్టు గురువారంనాడు కూడా విచారణ కొనసాగించనుంది.
ఇవి కూడా చదవండి..
మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..
మణిపూర్లో రాష్ట్రపతి పాలన రద్దు.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..