సాకులు చెబితే కుదరదు.. సీఎం విజయ్పై స్టాలిన్ తొలి విమర్శ
ABN , Publish Date - May 10 , 2026 | 02:17 PM
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందంటూ సీఎం విజయ్ చేసిన విమర్శపై డీఎంకే అధినేత స్టాలిన్ ఘాటుగా విమర్శించారు. మంచి పాలన అందించడమనేది పాలకుల పట్టుదలపై ఆధారపడి ఉంటుందని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ చేసిన తొలి ప్రసంగంపై డీఎంకే అధినేత స్టాలిన్ ఘాటుగా స్పందించారు. మోసపూరిత ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని హితవు పలికారు. విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం స్టాలిన్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఉచిత విద్యుత్, మహిళల భద్రత, మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు విజయ్ ప్రభుత్వం చేసిన ప్రకటనలను డీఎంకే అధినేత తన ప్రకటనలో స్వాగతించారు. అయితే, గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు మిగిల్చి ఖజానాను ఖాళీ చేసిందన్న సీఎం కామెంట్పై ఘాటుగా స్పందించారు. ఫిబ్రవరి బడ్జెట్లోనే రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి వివరంగా చెప్పామని గుర్తు చేశారు. ‘మీకు ఒటేసిన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేసేందుకు ప్రయత్నించవద్దు. పాలన అనేది పాలకుల పట్టుదల, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సాకులు చెబితే కుదరదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనా తమ పాలనలో సంక్షేమ పథకాలను కొనసాగించామని గుర్తు చేశారు. కొవిడ్ సంక్షోభం, వరదలు, ఆర్థిక అంశాల్లో తమిళనాడుపై కేంద్రం నిర్లక్ష్యం వంటి వాటిని ఎదుర్కొని సంక్షేమానికి పెద్ద పీటవేశామన్నారు. ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తామంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయ్ చెప్పిన మాటలను కూడా గుర్తు చేశారు. ప్రచారం, పాలన ఒకటి కాదని అన్నారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటో మీకూ త్వరలో అర్థమవుతుంది’ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అస్సాం సీఎంగా మళ్లీ హేమంత బిశ్వ శర్మ.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచింది: ప్రధాని మోదీ