దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:46 PM
రామ్ మందిర్ విరాళాల వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం స్పందించింది. అయోధ్య హుండీల నుంచి డబ్బులు దొంగతనం చేయటంపై ఆర్ఎస్ఎస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రామ్ మందిర్ విరాళాల వివాదంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం స్పందించింది. అయోధ్య హుండీల నుంచి డబ్బులు దొంగతనం చేయటంపై ఆర్ఎస్ఎస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటన ఎంతో బాధ కలిగించిందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే న్యూఢిల్లీ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. ఆలయ నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను కోరారు. దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు.
దత్తాత్రేయ హోసబలే తన ప్రసంగంలో.. ‘ఈ ఘటన కోట్లాది మంది రామభక్తుల నమ్మకాన్ని, హిందూ సమాజం సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన కారణంగా మేము తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యాం. ఈ దురదృష్టకర సంఘటనను హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థం కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. హిందూ సమాజంపై, సనాతన ధర్మంపై బురద జల్లడానికి ఈ వివాదాన్ని ఒక అస్త్రంగా మలచుకునే కుట్రలు జరుగుతున్నాయి‘..
‘ఈ కష్టసమయంలో హిందూ సమాజమంతా ఎంతో ఓపికను, నిగ్రహాన్ని ప్రదర్శించాలి. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా.. శత్రువుల కుట్రలను తిప్పికొట్టడానికి అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. రామమందిరం ఎన్నో తరాల పోరాటాలు, కోట్లాది మంది త్యాగాల ఫలితంగా నిర్మితమైంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఆలయ ట్రస్ట్ పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
రియల్ లైఫ్ బ్యాట్మ్యాన్.. వాళ్లు దొంగలు కాదు బాధితులే..
నెటిజన్లకు భయం పుట్టిస్తున్న సంఘటన.. వీడియో వైరల్