ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే.. పీఎస్ ఎదుట రాహుల్ గాంధీ నిరసన
ABN , Publish Date - Aug 21 , 2026 | 01:19 PM
పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిరసనకు దిగారు. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు నిరసనకు దిగారు. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు తెరతీశారు. సంసద్ యాత్ర సందర్భంగా పెల్లెట్ గన్ ప్రయోగంతో తనకు గాయాలయ్యాయని సాహిల్ లోచాబ్ అనే యువకుడు ఆరోపించాడు. ఈ విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తాను ఎన్ని సార్లు కోరినా పోలీసులు లక్ష్యపెట్టడం లేదని ఆరోపించాడు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేడు సాహిల్ లోచాబ్ను వెంట తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తొలుత రాహుల్ గాంధీ కాన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే, న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ పార్లమెంటు స్ట్రీట్ పీఎస్లో ఉన్నారని తెలియడంతో అక్కడకు వెళ్లారు. పెల్లెట్ గన్తో దాడి ఘటనపై దర్యాప్తు ఎంత వరకూ వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రావడంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. అయితే, ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మాత్రం వారు తిరస్కరించారు. దీంతో, పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
సంసద్ ఛలో యాత్ర సందర్భంగా పార్లమెంటుకు సమీపంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విద్యార్థులపై పెల్లెట్ గన్తో కాల్పులు జరిపారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఢిల్లీ పోలీసులు మాత్రం ఈ ఆరోపణలు తోసిపుచ్చారు. సీఆర్పీఎఫ్ కూడా ఇప్పటివరకూ స్పందించలేదు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ?
పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు